Sridevi Drama Company: ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే!

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లేటెస్ట్ ప్రోమో.. వృద్ధుల మనోగతాలతో ప్రత్యేక ఎపిసోడ్‌.

Updated : 17 Aug 2022 10:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కడుపున పుట్టిన వారే ‘మీరు నాకు భారం’ అని అంటే ఆ తల్లిదండ్రులు తట్టుకోగలరా? ఇదుగో నీ కోసం దుప్పట్లు తీసుకొస్తా, పండ్లు కొనుకొస్తా అని చెప్పి వృద్ధాశ్రమం దగ్గర వదిలేస్తే వారి గుండెలు పగలకుండా ఉండగలవా? ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా, ఎన్ని చూసినా అంతే! ఇలా చేసే వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (ఈటీవీ) కార్యక్రమం ప్రత్యేక ఎపిసోడ్‌ని రూపొందించింది. వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి అంకితమిచ్చింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలై, హృదయాన్ని బరువెక్కిస్తోంది.

వారంతా ఓ వృద్ధాశ్రమంలో కాలం గడిపేవారు. కడుపున పుట్టిన వారే కాదన్నారనే బాధలో ఉండే వారి మోముల్లో చిరు నవ్వులు విరబూయించే ప్రయత్నం ఇది. ఓ బామ్మతో కలిసి ఆది చేసిన కామెడీ అందరిలోనూ ఆనందం నింపింది. అనంతరం ఆ పెద్దావిడే ‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నని చూడాలి’ అంటూ ఆలపించి, హృదయాన్ని హత్తుకుంది. తన బిడ్డల్ని తలచుకుని కంటతడి పెట్టుకోవడంతో అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఓ అమ్మ విషయంలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సుధీర్‌. ‘ఇక్కడున్న తల్లిదండ్రులు వెక్కివెక్కి ఏడవాల్సిన అవసరం ఏముంది? చక్కగా మీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా’ అని తల్లిదండ్రుల్ని వదిలేసిన వారిని కోరాడు. ఇదే వేదికపై భాను, వర్ష ఈ వృద్దాశ్రమానికి రూ. 1,00,000 సాయం అందించారు. వారి మందులకయ్యే ఖర్చుల వివరాల్ని తెలుసుకుని, ఆ మొత్తాన్ని ప్రతినెలా నేనిస్తానని ఇంద్రజ తెలిపారు. పూర్తి ఎపిసోడ్‌ అక్టోబరు 3న ప్రసారంకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని