Anubhavinchu Raja: పూరి స్ఫూర్తితోనే పరిశ్రమలోకి వచ్చా

‘‘జీవితం చాలా చిన్నది. ఉన్నప్పుడే ఆస్వాదించాలనే విషయాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే మా చిత్రం’’ అన్నారు శ్రీను గవిరెడ్డి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుభవించు రాజా’.

Updated : 24 Nov 2021 07:57 IST

‘‘జీవితం చాలా చిన్నది. ఉన్నప్పుడే ఆస్వాదించాలనే విషయాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే మా చిత్రం’’ అన్నారు శ్రీను గవిరెడ్డి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుభవించు రాజా’. రాజ్‌తరుణ్‌, కశిష్‌ఖాన్‌ జంటగా నటించారు. యార్లగడ్డ సుప్రియ నిర్మాత. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను గవిరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘ప్రతి మనిషిలోనూ అనుభవించాలనే ఓ కోరిక ఉంటుంది. నిజంగా అనుభవించడం అంటే ఏమిటో మా సినిమాలో ఆలోచన రేకెత్తించేలా చెప్పాం. మనం ఎక్కడుంటే అది మన ఊరు కాదు. మనం పుట్టిందే మన ఊరు అనే భావోద్వేగం చుట్టూ అల్లుకున్న ఈ కథ గ్రామీణ   నేపథ్యంలో సాగుతుంది. సరదాగా సాగుతూనే, చివర్లో హృదయాల్ని హత్తుకునేంతగా భావోద్వేగాలు ఉంటాయి. భీమవరంతోపాటు, సెక్యూరిటీ క్యాంప్‌కి వెళ్లి చిత్రీకరణ చేశాం. కోడి పందేల నుంచే ఈ కథ మొదలవుతుంది. కోడి పుంజుల్లో రకాలు ఏమిటి? ఏ పుంజు ఎప్పుడు పందెం ఆడుతుందనే విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకుని చిత్రీకరణ చేశాం. ప్రతీ ఏడాది కోడి పందేలకి వెళ్తుంటా. అది ఈ సినిమా తీయడానికి మరింత మేలు చేసింది’’.

‘‘ఈ కథని నిర్మాత సుప్రియ తర్వాత నాగార్జున సర్‌, నాగచైతన్య విన్నారు. వాళ్లకి చాలా బాగా నచ్చింది. దాంతో ఈ సినిమా మొదలైంది. నేను అనుకున్న సినిమాని తెరకెక్కించా. ఎక్కడా ఎక్కువగా మార్పులు చేర్పులు చేయలేదు. అన్నపూర్ణ సంస్థలో చేయడం మరిచిపోలేని అనుభవం. చిత్రం విడుదలవుతున్న ఈ నెల 26 నుంచే సంక్రాంతి పండగ మొదలవుతుంది. అంత సందడి ఇందులో ఉంది. రాజ్‌తరుణ్‌తోపాటు అజయ్‌, నరేన్‌, అరియానా, రవికృష్ణ తదితరుల పాత్రలు చాలా బాగుంటాయి. ఉంగరాల జుత్తు ఉన్న అమ్మాయే కావాలి కాబట్టి కశిష్‌ఖాన్‌ని ఎంపిక చేశాం. ఆమె నటన గుర్తుండిపోయేలా ఉంటుంది. పూరి జగన్నాథ్‌ స్ఫూర్తితోనే పరిశ్రమలోకి వచ్చా. పరిశ్రమ, సినిమాలు చాలా నేర్పించాయి. 2016లోనే రెండు సినిమాలు చేశా. అవి అంతగా ఆడలేదు. ‘క్రాక్‌’ సినిమాకి రచయితగా పనిచేశా. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాకి ఓ రచయితగా పనిచేస్తున్నా. తదుపరి నా సినిమా పేరున్న ఓ నిర్మాణ సంస్థలోనే ఖరారైంది. ఆ వివరాలు ఆ సంస్థ నుంచే త్వరలోనే బయటికొస్తాయి’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని