Siddharth: సినీ పరిశ్రమను వేధించడం ఆపండి: సిద్ధార్థ్‌

సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంపై నటుడు సిద్ధార్థ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి ఎంతోమంది జీవనం సాగిస్తున్నారని.. అలాంటి పరిశ్రమనే ఎందుకు టార్గెట్‌...

Updated : 03 Dec 2021 12:02 IST

హైదరాబాద్‌: సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంపై నటుడు సిద్ధార్థ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి ఎంతోమంది జీవనం సాగిస్తున్నారని.. అలాంటి పరిశ్రమనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా #SaveCinema అంటూ వరుస ట్వీట్లు పెట్టారు.

‘‘25 సంవత్సరాల క్రితం మొదటిసారి విదేశాల్లో సినిమా చూశాను. నా స్టూడెంట్‌ ఐడీకార్డు ఉపయోగించి అప్పట్లోనే ఎనిమిది డాలర్లు అంటే రూ.200 చెల్లించి ఆ సినిమా చూశా. ఇప్పుడు మనం నిర్మిస్తున్న చిత్రాలు టెక్నాలజీ, టాలెంట్‌లో మిగతా దేశాల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. సినిమా టికెట్లు, పార్కింగ్‌ రేట్లపై ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు ఎలాంటి హక్కు లేదు. సినిమా కంటే మద్యం, పొగాకుకు మీరు ఎక్కువ గౌరవమిస్తున్నారు. ఇప్పటికైనా ఈ దురాచారాన్ని ఆపండి. ఎన్నో వేల మంది ప్రజలు పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నారు. మా వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలో మీరు మాకు చెప్పకండి. పన్నులు, సెన్సార్‌ విషయంలో మీరు ఏం చెప్పినా వింటాం. కానీ, నిర్మాతలు, వాళ్ల ఉద్యోగులకు జీవనోపాధి లేకుండా చేయకండి. మీకు ఆదాయం కావాలనుకుంటే ప్రతి పరిశ్రమలోనూ ఎంతో మంది సంపన్నులున్నారు.. వాళ్ల నుంచి కూడా తీసుకోండి. సినిమా పరిశ్రమ ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు. సినిమా బడ్జెట్‌ అనేది కొనుగోలుదారుడిపై ఆధారపడదు. ఆ సినిమా దర్శకుడు, నిర్మాతపై ఆధారపడి ఉంటుంది. సినిమా ద్వారా ఎవరు ఎంత సంపాదిస్తారో నిర్ణయించే హక్కు ఏ ఒక్కరికీ లేదు. పేదరికం నుంచి వచ్చి ధనికులుగా రాణిస్తున్న రాజకీయనాయకులను ప్రశ్నించగలరా? పరిశ్రమను వేధించడం ఇకనైనా ఆపండి. మనకి తిండి పెడుతున్న రైతులు ఎంత గొప్పవాళ్లో మనందరికీ తెలుసు.. ఇప్పటికే వాళ్ల కోసం మేము పోరాటం చేశాం. మేము రైతులంత గొప్పవాళ్లం కాకపోవచ్చు. కానీ మేము కూడా మనుషులం, పన్నుచెల్లింపుదారులం’’ అని సిద్ధార్థ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని