ఐశ్వర్య దంపతుల్ని కలిసిన వరలక్ష్మి.. ఆయన వల్లే సాధ్యమైంది

బాలీవుడ్‌ ప్రముఖ నటులు ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ దంపతుల్ని వరలక్ష్మి శరత్‌ కుమార్ కలిశారు‌. వాళ్లతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారామె.

Published : 25 Jul 2021 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటులు ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ దంపతుల్ని వరలక్ష్మి శరత్‌ కుమార్ కలిశారు‌. వాళ్లతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ కలయిక ఎలా కుదరింది అంటే? దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్’. ఇందులో ఐశ్వర్యరాయ్‌, విక్రమ్‌, త్రిష, కార్తి, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాశ్‌, శరత్‌ కుమార్‌ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఐశ్వర్య రాయ్‌తోపాటు శరత్‌ కుమార్‌ (వరలక్ష్మి తండ్రి) పాల్గొన్నారు. అలా చిత్రీకరణ విరామ సమయంలో ఐశ్వర్య, అభిషేక్‌, ఆర్యాధ్యని కలిశారు వరలక్ష్మి, ఆమె సోదరి పూజ.

‘ముగ్గురు మంచి వ్యక్తుల్ని నిన్న రాత్రి కలిశాను. వాళ్లెవరో కాదు అందాల నటి ఐశ్వర్య రాయ్‌, హ్యాండ్సమ్‌ అభిషేక్‌, వాళ్లమ్మాయి ఆరాధ్య. వాళ్లు చూపించే ప్రేమకు ఫిదా అయిపోయాను. ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం ఇది. దీనికి కారణమైన నాన్నా మీకు ధన్యవాదాలు. పూజా నువ్వింకా షాక్‌ నుంచి బయటకి వచ్చినట్టు లేవు కదా!’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. సుప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తొలి భాగం ‘పొన్నియిన్‌ సెల్వన్‌- 1’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని