Tollywood: టాలీవుడ్‌లో నేటి మేజర్‌ అప్‌డేట్‌లివే..!

కరోనా కారణంగా పరిస్థితులు ఎప్పుడు ఏవిధంగా మారుతాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అందుకే పరిస్థితులు బాగున్నప్పుడే సినిమా షూటింగ్స్‌ పూర్తి చేసేసుకుంటున్నారు. మరికొన్ని అయితే థియేటర్లు....

Updated : 12 Aug 2021 16:03 IST

హైదరాబాద్‌: కరోనా కారణంగా పరిస్థితులు ఎప్పుడు ఏవిధంగా మారుతాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అందుకే పరిస్థితులు బాగున్నప్పుడే సినిమా షూటింగ్స్‌ పూర్తి చేసేసుకుంటున్నారు. మరికొన్ని అయితే థియేటర్లు ఓపెన్‌లో ఉన్నప్పుడే ప్రేక్షకుల్ని అలరించేయాలని విడుదల తేదీలు ప్రకటించేస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం పలు చిత్రబృందాలు అప్‌డేట్‌లతో నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఇంతకీ ఏమా అప్‌డేట్‌లు.. ఏంటా కథలు.. ఓ లుక్కేయండి

వామ్మో.. ‌‘పుష్ప’రాజ్‌ ఊరమాస్‌..!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రెండు భాగాలుగా సిద్ధం కానున్న ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ నెలలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’లోని మొదటి పాట శుక్రవారం విడుదల కానుంది. ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుక్కుద్ది పీక’ అంటూ సాగే పాటను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్‌ సింగర్స్‌ ఆలపించారు. రేపు ఉదయం 11.07 గంటలకు పాట విడుదల కానుందని తెలియజేస్తూ ఓ సరికొత్త పోస్టర్‌ని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. బన్నీ గొడ్డలి పట్టుకుని ఊరమాస్‌ గెటప్‌లో కనిపించారు.


మీరూ ప్రేమలో పడటం ఖాయం..!

నటీనటులు సుధీర్‌, ఆనంది జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. గ్రామీణ నేపథ్యంలో సాగే అపురూపమైన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గురువారం ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 27న ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాకు బాగా నచ్చిన ఈ ప్రేమకథతో మీరూ ప్రేమలో పడాలని ఆశిస్తున్నాను’ అని సుధీర్‌ ట్వీట్‌ చేశారు.


‘మేజర్‌’ మళ్లీ మొదలెట్టేశారు..!

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న సినిమా ‘మేజర్‌’. శశి కిరణ్‌ తిక్కా దర్శకుడు. సయీ మంజ్రేకర్‌, శోభిత ధూలిపాళ్ల కథానాయిక. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా కొన్ని నెలల క్రితం వాయిదా పడిన ఈ సినిమా షూట్‌ గురువారం నుంచి మరలా ప్రారంభమైంది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్రబృందం ఆశిస్తుంది.


విడాకులిచ్చే ఫేమస్‌ లాయర్‌ ఈయనే..!

అక్కినేని సుమంత్‌, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మళ్ళి మొదలైంది’. కొత్తదనం నిండిన ప్రేమకథతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో పోసాని కృష్ణమురళీ కుటుంబరావు అనే విడాకుల లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం గురువారం సరికొత్త పోస్టర్‌ విడుదల చేసింది.


నిఖిల్‌ డబ్బింగ్‌ స్టార్ట్‌ చేశాడు..!

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకోనున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘18 పేజీలు’. పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తైంది. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు ప్రారంభించారు. నిర్మాణాంతర పనులు పూర్తైన వెంటనే సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని