Cinema News: ఫిబ్ర..‘బరి’

కుదిరితే పండగ గురి.. లేదంటే వేసవి బరి.. అగ్రతారల చూపెప్పుడూ వీటిపైనే ఉంటుంది. మామూలు రోజుల్లో బాక్సాఫీస్‌ రేసులో నిలవడాన్ని అరుదుగా చూస్తుంటాం. ఇక సినీ సీమకు అన్‌ సీజన్‌గా

Published : 22 Nov 2021 20:20 IST

అన్‌ సీజన్‌లో.. అదిరే వినోదం

కుదిరితే పండగ గురి.. లేదంటే వేసవి బరి.. అగ్రతారల చూపెప్పుడూ వీటిపైనే ఉంటుంది. మామూలు రోజుల్లో బాక్సాఫీస్‌ రేసులో నిలవడాన్ని అరుదుగా చూస్తుంటాం. ఇక సినీ సీమకు అన్‌ సీజన్‌గా భావించే ఫిబ్రవరిని లక్ష్యం చేసుకోవడమంటే ఓ సాహసమనే అనుకోవాలి.  ఇప్పుడిలాంటి సాహసాన్నే చేసి చూపుతున్నారు పలువురు అగ్రతారలు. కుర్ర హీరోలతో కలిసి అన్‌ సీజన్‌లో కాసుల పంట పండించేందుకు సిద్ధమవుతున్నారు.

కొత్త ఏడాది మొదలవుతుందంటే చాలు.. సినీప్రియుల కళ్లన్నీ సంక్రాంతిపైనే ఉంటాయి. పండగ బరిలో బాక్సాఫీస్‌ పందెం గెలిచే తారలెెవరంటూ ఆసక్తిగా చూస్తుంటారు. ఇక ముగ్గుల పండగ ముగిసిందంటే చాలు.. అందరి చూపు వేసవి వైపే మళ్లుతుంది. ఫిబ్రవరి విద్యార్థులకు పరీక్షా కాలం కావడంతో.. బాక్సాఫీస్‌ ముందు ప్రేక్షకుల సందడి అంతగా కనిపించదు. అందుకే ఆ ఒక్క నెల చిన్న చిత్రాలకు దారిచ్చేసి.. వేసవి మారథాన్‌లో పోటీ పడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అగ్ర తారలు. అయితే ఈసారి పరిస్థితులు తారమారయ్యాయి. అన్‌ సీజన్‌లోనూ అదిరే వినోదం కనువిందు చేయనుంది. ఫిబ్రవరి బరిలో పసందైన వినోదం వడ్డించేందుకు అటు స్టార్‌ హీరోలు.. ఇటు కుర్ర హీరోలు పోటీ పడుతున్నారు.

మెగా ప్రారంభం

ఫిబ్రవరి వినోదాలకు ‘ఆచార్య’తో మెగా ఓపెనింగ్‌ అందించనున్నారు అగ్ర హీరో చిరంజీవి. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరంజీవి ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ కలిసి సందడి చేస్తుండటంతో సినీప్రియుల కళ్లన్నీ దీనిపైనే ఉన్నాయి. కొరటాల శైలి సామాజిక అంశాలతో పాటు చిరు, చరణ్‌ మార్క్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ముస్తాబవుతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి ఆదరణ దక్కుతుండటంతో చిత్రంపై అంచనాలు రెట్టింపవుతున్నాయి.

* ఫిబ్రవరి రెండో వారంలో రవితేజ ‘ఖిలాడి’గా, అడివి శేష్‌ ‘మేజర్‌’గా థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆ నెల 11న  విడుదల కానున్న ఈ రెండు చిత్రాలపైనా ప్రేక్షకుల్లో   భారీ అంచనాలే ఉన్నాయి. రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ని రమేష్‌ వర్మ తెరకెక్కించారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో.. రవితేజ రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నారు.

* ఇక శేష్‌ హీరోగా నటిస్తున్న ‘మేజర్‌’ను శశికిరణ్‌ తిక్కా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా కోసం శేష్‌ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై అడివి శేష్‌ చాలా ఆశలే పెట్టుకున్నాడు.

* ఫిబ్రవరి మూడో వారాన్ని హీరో నిఖిల్‌తో కలిసి పంచుకోనుంది నటి అలియా భట్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించారు. ఇందులో అలియా  వేశ్య గృహం నడిపే మహిళగా శక్తిమంతమైన పాత్రలో కనువిందు చేయనుంది. జనవరి 6నే  విడుదల కావాల్సిన ఈ సినిమా.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసం ఆ తేదీ వదలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడది ఫిబ్రవరి 18న    ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ తేదీకే అలియాతో కలిసి బాక్సాఫీస్‌ను పంచుకోనున్నారు నిఖిల్‌. ఆయన హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రం ‘18 పేజీస్‌’. విభిన్నమైన ప్రేమకథాంశంతో రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. దీనిపై ఇటు నిఖిల్‌, అటు అనుపమ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే రెండేళ్ల విరామం తర్వాత వాళ్లిద్దరి నుంచి వస్తున్న కొత్త చిత్రమిది.

* కోబ్రా బ్రదర్స్‌గా ‘ఎఫ్‌ 2’ సినిమాతో కడుపుబ్బా నవ్వించారు వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌. ఇప్పుడీ ఇద్దరూ మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్‌ కథానాయికలు. తొలి భాగానికి మించిన రెట్టింపు వినోదాలతో ముస్తాబు చేస్తున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కాలంలో వెంకీ నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం 2’ ఓటీటీ బాట పట్టడంతో.. థియేటర్లలోకి రానున్న ‘ఎఫ్‌ 3’పై సినీప్రియుల్లో  చాలా అంచనాలున్నాయి.


వీటి దారెటో?

శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన ద్విభాషా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇది వరకే ప్రకటించారు. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశముంది. నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన సినిమా ‘థ్యాంక్‌ యూ’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఎప్పుడొస్తుందనేది తేలలేదు. రానా - సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాటపర్వం’, నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రాలు ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలోనే ఉన్నాయి. మరి ఈ రెండూ జనవరి బరిలో నిలుస్తాయా? లేక ఫిబ్రవరి వైపు చూసే అవకాశముందా? తేలాల్సి ఉంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని