Tollywood:మెరుపుల కొత్త తారకలు

తెలుగు చిత్రసీమ ఓ పుష్పక విమానం. ఏటా ఎంతమంది కొత్త తారలొచ్చినా.. మరొకరికి చోటు ఉంటూనే ఉంటుంది. అయితే అలా వచ్చీ రాగానే విజయాన్ని అందుకొని.. వరుస అవకాశాలతో దూసుకెళ్లే తారలు తక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఈ ఏడాది అలా జోరు చూపించిన కొత్త నాయకానాయికలు చాలా మందే ఉన్నారు. మరి ఆ తారలెవరు? ఈ ఏడాది వారి సినీ ప్రయాణం ఎలా సాగిందో చదివేద్దాం...

Updated : 22 Dec 2021 05:41 IST

2021లో అలరించిన నయా నాయకానాయికలు

తెలుగు చిత్రసీమ ఓ పుష్పక విమానం. ఏటా ఎంతమంది కొత్త తారలొచ్చినా.. మరొకరికి చోటు ఉంటూనే ఉంటుంది. అయితే అలా వచ్చీ రాగానే విజయాన్ని అందుకొని.. వరుస అవకాశాలతో దూసుకెళ్లే తారలు తక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఈ ఏడాది అలా జోరు చూపించిన కొత్త నాయకానాయికలు చాలా మందే ఉన్నారు. మరి ఆ తారలెవరు? ఈ ఏడాది వారి సినీ ప్రయాణం ఎలా సాగిందో చదివేద్దాం.


కొత్త హీరోల్లో.. ఆ ఇద్దరే

ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో మంది కొత్త హీరోలు వెండితెరపై అదృష్టం పరీక్షించుకున్నారు. వారిలో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుంది వైష్ణవ్‌ తేజ్‌, తేజ సజ్జానే. ఈ ఇద్దరూ ఒకే నెలలో హీరోలుగా తెరకు పరిచయమవడం విశేషం. తొలి సినిమాతోనే ఓవర్‌ నైట్‌ స్టార్‌గా ఎదిగిన కథానాయకులు ఇటీవల కాలంలో తెలుగు తెరపై పెద్దగా కనిపించలేదు. కానీ, ఈ ఏడాది ‘ఉప్పెన’తో ఆ మ్యాజిక్‌ను చేసి చూపించారు వైష్ణవ్‌ తేజ్‌. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ ముందు ఉప్పెనలా వసూళ్ల వర్షం కురిపించింది. ఇందులో ఆశీగా వైష్ణవ్‌ నటనకు సినీప్రియులు జేజేలు పలికారు. ఇక ఈ ఏడాది ఆయన నుంచి వచ్చిన మరో సినిమా ‘కొండపొలం’. క్రిష్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా.. నటుడిగా వైష్ణవ్‌కు మంచి మార్కులే పడ్డాయి.

‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’, ‘ఛత్రపతి’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి బాల నటుడిగా సత్తా చాటాడు తేజ సజ్జా. 2019లో వచ్చిన సమంత ‘ఓ బేబీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఈ ఏడాది ‘జాంబిరెడ్డి’తో హీరోగా తెరకు పరిచయమయ్యాడు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన వినోదాత్మక యాక్షన్‌ థ్రిల్లర్‌.. ఫిబ్రవరి 5న విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తేజ నుంచి వచ్చిన ‘ఇష్క్‌’ పూర్తిగా నిరాశ పరచగా.. ‘అద్భుతం’ మిశ్రమ స్పందన దక్కించుకుంది.    


నాయికల జోరు..

చూపు తిప్పుకోనివ్వని అందం.. ఆకట్టుకునే అభినయంతో ‘ఉప్పెన’లా తెలుగు తెరపైకి దూకిన సోయగం కృతి శెట్టి. సినిమా విడుదలకు ముందే పాటలు, ప్రచార చిత్రాలతో సినీప్రియుల్లో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ‘బేబమ్మ’.. ‘ఉప్పెన’ విడుదల తర్వాత మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ కన్నడ కస్తూరి.. వచ్చే ఏడాది ‘బంగార్రాజు’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేయనుంది. అలాగే రామ్‌ - లింగుస్వామి కలయికలో రూపొందుతోన్న చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది. ‘జాతిరత్నాలు’ సినిమాతో చిట్టిగా సినీప్రియుల్ని నవ్వుల జల్లుల్లో తడిపేసిన తెలుగందం ఫరియా అబ్దుల్లా. నాగ్‌ అశ్విన్‌ నిర్మాణంలో అనుదీప్‌ తెరకెక్కించిన ఈ వినోదాత్మక చిత్రం.. మార్చి 11న విడుదలై మంచి వసూళ్లు అందుకొంది. ఇందులో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలతో కలిసి ఫరియా చేసిన అల్లరి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇటీవలే అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లోనూ తళుక్కున మెరిసి మురిపించింది. ప్రస్తుతం నాగర్జున, నాగచైతన్యలతో కలిసి ‘బంగార్రాజు’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘షాదీ ముబారక్‌’తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్న మరో సోయగం దృశ్యా రఘునాథ్‌. పెళ్లి చూపుల నేపథ్యం చుట్టూ అల్లుకున్న ఆసక్తికర ప్రేమకథాంశంతో రూపొందిన ఈ సినిమాలో తుపాకుల సత్యభామగా దృశ్య నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.'

ఈ ఏడాదే తెలుగు తెరపై మెరిసి.. జయాపజయాలతో సంబంధం లేకుండా జోరు చూపించిన భామలు చాలా మందే ఉన్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేతిక శర్మ, శ్రీలీల, మీనాక్షి చౌదరి, అమృత అయ్యర్‌ల గురించే. ‘లింగా’, ‘బిగిల్‌’ లాంటి తమిళ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన సోయగం అమృతా అయ్యర్‌. రామ్‌ నటించిన ‘రెడ్‌’తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘30రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాతో నటిగా చక్కటి గుర్తింపు దక్కించుకుంది. ఇందులో ప్రదీప్‌కు జోడీగా ‘అమ్మాయిగారు’ పాత్రలో అమృత నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఆమె ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘హనుమాన్‌’లో నాయికగా నటిస్తోంది. సుశాంత్‌ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో నాయికగా తెలుగు తెరపై కాలుమోపింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటలేకపోయినా.. నటిగా మీనాక్షికి మంచి గుర్తింపే తీసుకొచ్చింది.

నిజానికి ఈ చిత్రం విడుదలకు ముందే ఆమె రవితేజ సరసన ‘ఖిలాడి’లో నటించే అవకాశం దక్కించుకుంది. దీంతో పాటు అడివిశేష్‌ హీరోగా నటిస్తున్న ‘హిట్‌ 2’లోనూ నాయికగా నటిస్తోంది. ‘రొమాంటిక్‌’ సినిమాతో.. తొలి అడుగులోనే కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన ఉత్తరాది సోయగం కేతిక శర్మ. తనదైన హాట్‌ లుక్స్‌తో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేసిన ఈ రొమాంటిక్‌ భామ.. ఇటీవలే రెండో ప్రయత్నంగా ‘లక్ష్య’తో బాక్సాఫీస్‌ ముందుకొచ్చింది. ఈ రెండు సినిమాలు చేదు ఫలితాలే అందించినా.. తనదైన అందచందాలతో నటిగా ప్రేక్షకులపై బలమైన ముద్రే వేసింది కేతిక. ఆమె ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్‌కు జోడీగా ఓ కొత్త చిత్రంలో నటిస్తోంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్లి సందడి’ సినిమాతో వెండితెరపై మెరిసిన కొత్తందం శ్రీలీల. తెలుగు నాట పుట్టి.. కన్నడ సినిమాలతో సత్తా చాటిన ఈ నయా నాయిక..తెలుగులో తొలి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో జోరు చూపిస్తోంది. ప్రస్తుతం రవితేజ సరసన ‘ధమాకా’లో నటిస్తున్న ఆమె.. త్వరలో శర్వానంద్‌, నిఖిల్‌ సినిమాల్లో నటించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు