Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే!

Tollywood: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో తెలుసా?

Published : 07 Dec 2021 02:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అఖండ’ విజయంతో తెలుగు బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. ఇక ఇక్కడి నుంచి సంక్రాంతి వరకూ వరుస సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ క్రమంలో డిసెంబరు రెండో వారంలో అటు థియేటర్‌, ఇటు ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దామా!

నాగశౌర్య ‘లక్ష్యం’ సాధించాడా?

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌, పుస్కర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు. కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు, సచిన్‌ ఖేద్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విలువిద్య నేపథ్య కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు నాగశౌర్య. కాల భైరవ స్వరాలు సమకూరుస్తున్నారు.


శ్రియ ‘గమనం’ ఎటు?

శ్రియ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘గమనం’. సుజనారావు తెరకెక్కించారు. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ సంయుక్తంగా నిర్మించారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్‌, నిత్యా మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. భావోద్వేగభరితమైన మూడు కథలతో రూపొందిన చిత్రమిది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో కనిపించనుంది.


నయీం అసలు కథ ఏంటి?

పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కిన ‘నయీం డైరీస్‌’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దాము బాలాజీ దర్శకత్వం వహించిన చిత్రమిది. వశిష్ఠ సింహ ప్రధాన పాత్ర పోషించారు. సీఏ వరదరాజు నిర్మాత. ‘‘రాజకీయ, పోలీస్‌ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయనే విషయాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం. నయీం ఎన్‌కౌంటర్‌ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యయనం చేశా. నయీం సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అతని డైరీలో పేర్కొన్న విషయాలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి. వశిష్ఠ సింహ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చిత్ర బృందం చెబుతోంది.


బురదలో ఆట ‘మడ్డీ’

యువన్‌, రిధాన్‌ కృష్ణ, అనూష సురేష్‌, అమిత్‌ శివదాస్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మడ్డీ’. ప్రగభల్‌  దర్శకుడు. ప్రేమ కృష్ణదాస్‌ నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని తెలుగులో నిర్మాత దిల్‌రాజు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘మడ్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఐదేళ్లు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. ఇందులో ఫ్యామిలీ డ్రామా, వినోదం, సాహసం.. ఇలా ప్రతి ఎమోషన్‌ ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రధాన నటులకు రోడ్‌ రేసింగ్‌లో రెండేళ్లు శిక్షణ ఇచ్చారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రవి బస్రూర్‌ స్వరాలందిస్తున్నారు.


ఇవే కాదు.. దేవరాజ్, సోనాక్షి వర్మ జంటగా మదుగోపు దర్శకత్వంలో తెరకెక్కిన బుల్లెట్‌ సత్యం, ప్రియతమ, మనవూరి పాండవులు, కటారి కృష్ణ, సర్వం సిద్ధం తదితర చిత్రాలు కూడా డిసెంబరు 10న థియేటర్స్‌లో విడుదల కానున్నాయి.


ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే!

‘ఆహా’లో పుష్పకవిమానం

విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘పుష్పకవిమానం’. నవంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్‌ 10వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్‌ అమాయకుడైన స్కూల్‌ టీచర్‌ పాత్ర పోషించారు. కామెడీ, సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో గీతాషైనీ, శాన్వి మేఘన, సునీల్‌, హర్షవర్ధన్‌, నరేశ్‌ కీలకపాత్రలు పోషించారు.


అమెజాన్‌ ప్రైమ్‌

* ద ఎక్స్‌పాన్స్‌ (వెబ్‌ సిరీస్‌ సీజన్‌-6) డిసెంబరు10

* ఎన్‌కౌంటర్‌ (హాలీవుడ్‌ మూవీ) డిసెంబరు10

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

* ఆర్య (హిందీ వెబ్‌ సిరీస్‌ సీజన్‌-2) డిసెంబరు 10

నెట్‌ఫ్లిక్స్‌

* ద లైట్‌ హౌజ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 6

* వాయిర్‌ డిసెంబరు 6

* టైటాన్స్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌-3) డిసెంబరు 8

*అరణ్యక్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 10

* ద అన్‌ ఫర్‌గివబుల్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 10

జీ5

కాతిల్‌ హసీనోంకే నామ్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 10

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని