Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

telugu movies: ఈ క్రిస్మస్‌కు థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

Updated : 21 Dec 2021 10:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అఖండ’, ‘పుష్ప’ ఇచ్చిన జోష్‌తో బాక్సాఫీస్‌ వద్ద సినిమాల సందడి కొనసాగుతోంది. కొవిడ్‌కు ముందున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ఇప్పుడు మా వంతు అంటూ ఈ క్రిస్మస్‌కు కొన్ని సినిమాలు సందడి చేయడానికి వస్తున్నాయి. అవేంటో చూసేయండి.

మరోసారి ప్రేక్షకుల ముందుకు మ్యాట్రిక్స్‌

యాక్షన్‌ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రం ‘ది మ్యాట్రిక్‌’. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ది మ్యాట్రిక్స్‌ రీలోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్‌ రెవెల్యూషన్స్‌’ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లో వస్తున్న చిత్రం ‘ది మ్యాట్రిక్స్‌ రీసర్కషన్స్‌’(The Matrix Resurrections). లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీనూ రీవ్స్‌, క్యారీ అన్నె మోస్‌లతో పాటు, బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా(Priyanka chopra) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె సతి అనే సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారు.


ఈ క్రిస్మస్‌ మనదే అంటున్న నాని

నాని(Nani) కథానాయకుడిగా పవర్‌ఫుల్‌ కథాంశంతో తెరకెక్కిన సూపర్ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శ్యామ్‌ సింగరాయ్‌’(Shyam SinghaRoy). రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి(Sai pallavi), కృతిశెట్టి కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 24న థియేటర్‌లలో విడుదల కానుంది. గతంలో నాని నటించిన రెండు చిత్రాలూ వరుసగా ఓటీటీల్లో విడుదల కావడంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ థియేటర్‌లోనే విడుదలవుతుండటంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. పునర్జన్మల ఇతి వృత్తంతో కోల్‌కతా నేపథ్యంలో కథ సాగుతుందని ప్రచార చిత్రాలను బట్టి అర్థమవుతోంది.


భారతీయులు గర్వించే ఆ క్షణాలు వెండితెరపై..

భారతీయ క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ టోర్నమెంట్‌ 1983 ప్రుడెన్షియల్‌ కప్‌. ఏమాత్రం అంచనాల్లేకుండా ప్రపంచకప్‌ టోర్నీలో అడుగుపెట్టిన కపిల్‌ సేన ఫైనల్‌లో చిరస్మరణీయ విజయం సాధించి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది. ఆ మధుర స్మృతులను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ‘83’. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer Singh) కపిల్‌దేవ్‌ పాత్రను పోషించారు. దీపిక పదుకొణె, పంకజ్‌ త్రిపాఠి, జీవా తదిరులు నటించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు డిసెంబరు 24న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు, పలు భారతీయ భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు.


సప్తగిరి ‘గూడు పుఠాణి’

సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్‌.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడు పుఠాణి’(Guduputani). పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్‌ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్‌ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది.


ఎట్టకేలకు వస్తున్న బ్యాక్‌ డోర్‌

పూర్ణ(Poorna) ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌డోర్‌’(Back door). బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మాత. ప్రణవ్‌ స్వరాలందించారు. ఈ సినిమాని డిసెంబర్‌ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో.. చక్కటి సందేశమిస్తూ సినిమాని రూపొందించాం. పూర్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని నిర్మాత తెలియజేశారు.


వాస్తవ ఘటనల ఆధారంగా.. ‘ఆశా ఎన్‌కౌంటర్‌’

యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్‌ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఆశ ఎన్‌కౌంటర్‌’. 2019 నవంబర్‌ 26న హైదరాబాద్‌ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్‌ చంద్ర ‘ఆశ ఎన్‌కౌంటర్‌’ తెరకెక్కించారు. డిసెంబరు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.



ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రాలు/కార్యక్రమాలివే!

వెబ్‌ కెమెరాతో తీసిన చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’

అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా కె.వి.గుహన్‌ తెరకెక్కించిన చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). రవిప్రసాద్‌ రాజు దాట్ల నిర్మాత. సైమన్‌ కె.కింగ్‌ స్వరాలందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, డిసెంబర్‌ 24న ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీ లివ్‌’లో విడుదల కానుంది. ‘తొలిసారి తెలుగులో వస్తున్న కంప్యూటర్‌ స్క్రీన్‌ బేస్డ్‌ మూవీ ఇది’ అని చిత్ర బృందం తెలిపింది.


సూపర్‌ హీరో కథతో..

మలయాళ నటుడు టోవినో థామస్‌(Tovino Thomas) కథానాయకుడిగా బసిల్‌ జోసెఫ్ తెరకెక్కిస్తున్న సూపర్‌హీరో అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘మిన్నల్‌ మురళి’(Minnal Murali). మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీల్లో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది విడుదల కానుంది. అనుకోని పరిస్థితుల్లో మెరుపుల కారణంగా జైసన్‌ అనే టైలర్‌ అనే వ్యక్తి అతీంద్రియ శక్తులు పొందుతాడు. వాటితో తన ఊరికోసం ఏం చేశాడు? వాటిని ఎలా ఉపయోగించాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డిసెంబరు 24న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘మిన్నల్‌ మురళి’ స్ట్రీమింగ్‌కానుంది.


ధనుష్‌ బాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘అతరంగీ రే’

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్‌ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అతరంగీ రే’. సారా అలీఖాన్‌ కథానాయిక. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఇంద్రజాలికుడిగా అక్షయ్‌కుమార్‌, ప్రేమికులుగా ధనుష్‌, సారా అలీఖాన్‌ కనిపించనున్నారు.


బాహుబలి నిర్మాతల నుంచి..

సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే ‘పరంపర’ చూడాల్సిందే అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాతలు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. హరి యెల్లేటి కథను అందించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘పరంపర’ స్ట్రీమింగ్‌ కానుంది.


అందులో ‘మానాడు’ స్ట్రీమింగ్‌

తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ‘లూప్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం లూప్‌ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో పాత్రతోపాటు పోలీసు ఆఫీసర్‌ ‘డీసీపీ ధనుష్కోటి’ పాత్ర కూడా ఎంతో కీలకం. ఈ పాత్రను నటుడు, దర్శకుడు ఎస్‌.జె సూర్య పోషించారు. కాగా, ఇప్పుడు ఈ చిత్రం డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.


ఫీల్‌గుడ్‌ మూవీ ‘వరుడు కావలెను’

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు జీ5  ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


హైవోల్టేజ్‌ యాక్షన్‌ ఇక అమెజాన్‌ ప్రైమ్‌లో..

జాన్‌ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. దానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించింది. యాక్షన్‌ సన్నివేశాలకు ఇందులో పెద్ద పీట వేశారు. కాగా, డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.


డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌

* ఎన్‌క్యాంటో

* ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫే

సోనీ లివ్‌

* మధురం

అమెజాన్‌ ప్రైమ్‌

* ది సూసైడ్‌ స్క్వాడ్‌

* బీయింగ్‌ ది రికార్డోస్‌

జీ5 ప్రైమ్‌

* బ్లడ్‌ మనీ

* బజరంగీ2

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని