eega: రాజమౌళి.. ‘ఈగ’తోనే ఎందుకంటే..?

విజువల్‌ వండర్‌ అనే పదానికి టాలీవుడ్‌లో అసలైన అర్థం చెప్పిన చిత్రం ‘ఈగ’. భారీ హిట్ కొట్టాలంటే స్టార్‌ హీరోలతోనే తీయాల్సిన అవసరం లేదని నిరూపించిన సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై నేటికి తొమ్మిదేళ్లు. నాని, సమంత జంటగా.. కన్నడ నటుడు సుదీప్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు.

Updated : 30 Jul 2022 12:26 IST

విజువల్‌ వండర్‌కు నేటితో పదేళ్లు


 

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజువల్‌ వండర్‌ అనే పదానికి టాలీవుడ్‌లో అసలైన అర్థం చెప్పిన చిత్రం ‘ఈగ’. భారీ హిట్ కొట్టాలంటే స్టార్‌ హీరోలతోనే తీయాల్సిన అవసరం లేదని నిరూపించిన సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై నేటికి పదేళ్లు. నాని, సమంత జంటగా.. కన్నడ నటుడు సుదీప్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. ఈ సినిమా 2012లో ఇదే రోజున విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాసింది. ఈ సందర్భంగా ‘ఈగ’ చేసిన విధ్వంసాన్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుందాం..

నాని అనే కుర్రాడు పక్కింటి అమ్మాయి బిందు(సమంత)తో ప్రేమలో పడతాడు. ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. ఆమెకు కూడా ఆ కుర్రాడు అంటే ఇష్టమే. కాకపోతే బయటపడదంతే. తీరా ఆ ఇద్దరూ ఒక్కటయ్యే సమయానికి విలన్‌ సుదీప్‌ ఎంటర్‌ అవుతాడు. బిందు అందంపై కన్నేస్తాడు. ఇంతలోనే ఈ ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడుతున్నారని విషయాన్ని గ్రహించి జీర్ణించుకోలేకపోతాడు. ఈ క్రమంలోనే నానిని హత్య చేస్తాడు. ఓ పనైపోయింది అనుకుంటాడు. కానీ.. అక్కడే అసలు కథ మొదలవుతుంది. నాని ఈగ రూపంలో మళ్లీ జన్మిస్తాడు. ఈ విషయం ఇటు బిందుకు అటు విలన్‌కూ తెలుస్తుంది. ప్రేమ ముందు ఏదీ గెలవలేదన్న నమ్మకంతో తనను చంపిన సుదీప్‌పై పగ తీర్చుకోవడంతో పాటు బిందును విలన్ బారి నుంచి కాపాడాలని ‘ఈగ’ నిర్ణయించుకుంటుంది. అనుకున్నట్లుగానే ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. మరి అంతటి బలవంతుడైన విలన్‌ను ఆ ఈగ ఎలా ఢీకొట్టింది..? ఎలాంటి ఇబ్బందులు పెట్టింది అనేదే కథ. 

‘ఈగ’తోనే ఆసక్తి..

తొలుత చిన్న సినిమాగా తీద్దామని రాజమౌళి మొదలు పెట్టిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌ చిత్రంగా మారిపోయిందట. రాజమౌళి ‘మగధీర’ తర్వాత కాస్త విశ్రాంతి కోసం ‘మర్యాద రామన్న’ తెరకెక్కించారు. ఆ తర్వాత ప్రభాస్‌తో సినిమా తీసేందుకు నాలుగైదు నెలల సమయం ఉంది. ఆ సమయంలో ఓ సినిమా తీసేద్దాం అని ‘ఈగ’ను మొదలు పెట్టారు. ఈగ అంటే మనం చేత్తో విదిలించుకునే ఒక పురుగు. అలాంటి పురుగు మనిషి మీద పగ తీర్చుకోవడమంటే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ‘ఈగ’ను ఎంచుకున్నారట. తొలుత రూ.2 కోట్ల నుంచి 3 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించాలన్న ఉద్దేశంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఒక సాధారణ డిజిటల్‌ కెమెరాతో తీసి కేవలం మల్టీప్లెక్స్‌లు, కొన్ని ఎంచుకున్న థియేటర్లలో మాత్రమే విడుదల చేద్దామని అనుకున్నారట. చిత్రీకరణ సమయంలో ప్రతి సన్నివేశాన్ని బడ్జెట్‌ దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించారు. అయితే.. నిర్ణీత బడ్జెట్‌ పెద్ద సమస్యగా మారింది. అడుగు ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే నిర్మాత సురేశ్‌బాబు కల్పించుకొని.. మీరు అనుకున్నట్లుగా సినిమా తీయండి బడ్జెట్‌ సంగతి తర్వాత చూసుకుందాం అన్నారు. తీరా చూస్తే.. చిన్నది అనుకున్న సినిమా కాస్త పెద్ద బడ్జెట్‌ సినిమా అయిపోయింది. బ్లాక్‌ బస్టర్ హిట్‌ కొట్టింది.

సీక్వెల్‌ ఎప్పుడు..?

‘ఈగ’ సీక్వెల్‌ గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. దీనిపై రాజమౌళి అయితే ఎప్పుడు స్పందించలేదు. కానీ.. కొన్నిరోజుల కిందట సినిమా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈగ’ సీక్వెల్‌ చేయాలన్న ఆలోచన ఉందని, కాకపోతే ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని