Tiger Nageswara Rao: ఆ నిజాన్ని చెప్పేందుకే ఈ ‘టైగర్‌ నాగేశ్వరరావు’: దర్శకుడు వంశీ

రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమాన్ని చిత్ర బృందం రాజమహేంద్రవరంలో బుధవారం నిర్వహించింది.

Published : 24 May 2023 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు రవితేజ (Ravi Teja) హీరోగా ‘దొంగాట’ ఫేం వంశీ (vamsee) తెరకెక్కిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ఈ సినిమా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం.. రాజమహేంద్రవరంలోని గోదావరి వంతెనపై రవితేజ అభిమానుల సమక్షంలో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ఆవిష్కరించింది. అనంతరం, దర్శకుడు వంశీ, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ విలేకర్లతో ముచ్చటించారు. ఆ వివరాలివీ..

* స్టూవర్టుపురం నేపథ్యంలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలో కొత్తగా ఏం ఉండబోతుంది?

వంశీ: నేను ఆ రెండు సినిమాలు చూశాను. వాటిల్లో చిరంజీవి సర్‌ నటించింది ఫిక్షన్‌ కథ (స్టూవర్టుపురం పోలీస్‌ స్టేషన్‌). దర్శకుడు సాగర్‌ గారు తీసింది కేవలం స్టూవర్టుపురం చుట్టూ తిరిగే కథ (స్టూవర్ట్‌పురం దొంగలు). నేను టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌ తీస్తున్నా. ఆయనేం చేశారో దాన్నే తెరపైకి తీసుకొస్తున్నా.

* ఈ సినిమా కోసం రవితేజను ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి?

వంశీ: ముందుగా ఈ సినిమా కోసం వేరే హీరోలను అనుకున్నా. ఆయా నటులు అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో రవితేజ సర్‌కి ఈ స్క్రిప్టు వినిపించా. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమాని చేరువ చేయగలిగే నటుడాయన.

* రవితేజ ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఏం ఉన్నాయి?

వంశీ: రవితేజ అభిమానులు కోరుకునే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇందులో చాలా ఉన్నాయి. పోరాటాల చిత్రీకరణ కోసం రాజమహేంద్రవరం బ్రిడ్జి సెట్‌ని తీర్చిదిద్దాం. ఈ సినిమాలో రవితేజ పూర్తి భిన్నంగా కనిపిస్తారు. ఆయన గత చిత్రాల్లోని బాడీ లాంగ్వేజ్‌ ఈ సినిమాలో కొంచెం కూడా కనిపించదు. రవితేజ చిత్రం ‘ధమాకా’ రూ. 100 కోట్ల వసూళ్లు చేసింది. ఈ సినిమా రూ. 1000 కోట్ల కలెక్షన్‌ చేయాలంటే నేను కొత్తగా ట్రై చేయాలి కదా. దానికి తగ్గట్టే కథను సిద్ధం చేశా.

* ‘దొంగల’ కథలపైనే దృష్టి పెట్టారెందుకు?

వంశీ: కావాలని అలా చేయట్లేదు (నవ్వుతూ). అనుకోకుండా జరిగిపోతోంది. ఈసారి తప్పకుండా నేపథ్యం మారుస్తా.

* ఈ బయోపిక్‌లో ఏ మేరకు పాజిటివ్‌ కోణాన్ని చూపించబోతున్నారు?

వంశీ: ఇప్పటి వరకు చాలామంది.. క్రికెటర్లు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల బయోపిక్‌లు తీశారు. నెగెటివ్‌ ఛాయలున్నా టైగర్‌ నాగేశ్వరరావు చాలామందికి తెలుసు. ఆయన చనిపోయాడని తెలిసి, భౌతిక కాయాన్ని చూసేందుకు సుమారు 3 లక్షల మంది వెళ్లారని నేను చేసిన రీసెర్చ్‌లో భాగంగా తెలుసుకున్నా. ఆయన జీవితంలో బయటపడని నిజమేదో దాగుందని అర్థమైంది. ఆ ట్రూత్‌ కోసమే ఈ చిత్రం చేస్తున్నా.

* ఈ స్టోరీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కదా. పాన్‌ ఇండియా స్థాయిలో ఎందుకు తెరకెక్కించాలనుకున్నారు?

వంశీ: టైగర్‌ నాగేశ్వరరావు పుట్టింది ఇక్కడే అయినా అన్ని ప్రాంతాల వారికి సాయం చేశాడు. ఆయన చేసిన మంచి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో తీస్తున్నాం.

ఆసక్తి రేకెత్తించేలా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మోషన్‌ పోస్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని