Tollywood: కథానాయకుల ‘త్రిబుల్‌’ ధమాకా

రెండేళ్లుగా సినిమా రంగాన్ని కరోనాకాలం వెంటాడింది. ఒప్పుకొన్నవి పూర్తి కాక... కొత్తవి చేయలేక ఇబ్బంది పడ్డారు కథానాయకులు. ఇప్పుడు పరిస్థితులు కుదుట పడటంతో హీరోలు వేగంగా చిత్రాలు

Updated : 17 Aug 2022 10:26 IST

రెండేళ్లుగా సినిమా రంగాన్ని కరోనాకాలం వెంటాడింది. ఒప్పుకొన్నవి పూర్తి కాక... కొత్తవి చేయలేక ఇబ్బంది పడ్డారు కథానాయకులు. ఇప్పుడు పరిస్థితులు కుదుట పడటంతో హీరోలు వేగంగా చిత్రాలు పూర్తిచేస్తున్నారు. 2022లోనే కొంతమంది కనీసం మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. నిన్నటి ‘అఖండ’ నుంచి నేటి ‘కేజీఎఫ్‌-2’ వరకు సినిమాలన్నీ రికార్డుల దుమ్ము దులిపాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌లాంటి హీరోలు వరసగా పలు చిత్రాలకు ఓకే చెబుతుంటే.. మరి కొందరు ఒకే సంవత్సరంలో మూడు, నాలుగు షూటింగ్‌లు ముగించేసి విడుదల చేయడానికి సై అంటున్నారు. మరి ఆ కథానాయకులెవరు? వారి ప్రాజెక్టులేంటో చూద్దామా?

ముందున్న మాస్‌ మహారాజా

రేసులో అందరినీ మించి రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్నాడు మాస్‌ మహారాజా రవితేజ. వరుసపెట్టి కొత్త సినిమాలకు పచ్చ జెండా ఊపుతున్నాడు. ఈ ఏడాదిలో తను నటించిన చిత్రాలు నాలుగు విడుదల కానున్నాయి. ఫిబ్రవరిలో ‘ఖిలాడీ’తో పలుకరించిన రవితేజ తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’లో నటిస్తున్నాడు. దీన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇందులో ‘పెళ్లి సందడి’ ఫేం శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామారావ్‌ ఆన్‌ డ్యూటీ’ జూన్‌లో డ్యూటీ ఎక్కనుంది. దివ్యాన్ష్‌ కౌశిక్‌, రజిషా విజయన్‌లతో కలసి రవితేజ ఇందులో ఆడిపాడనున్నాడు. అలాగే సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో అయిదుగురు భామలు అనూ ఇమ్మాన్యుయెల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడలతో రొమాన్స్‌ చేయనున్నాడు రవితేజ. మరోవైపు ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అదే వేగంతో చిత్రీకరణ చేయనున్నారు.


జోరుమీదున్న బంగార్రాజు

‘బంగార్రాజు’తో సంక్రాంతి హిట్‌ కొట్టాడు నాగ   చైతన్య. ఇదే ఏడాది తను నటిస్తున్న చిత్రాలు సందడి చేయనున్నాయి. ‘మనం’తో అక్కినేని కుటుంబానికి తీపి జ్ఞాపకాన్ని అందించిన విక్రమ్‌ కె కుమార్‌  దర్శకత్వం వహిస్తున్న ‘థాంక్యూ’ చిత్రం జులైలో  విడుదల కానుంది. ఇందులో చైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. అమీర్‌    ఖాన్‌తో కలిసి చైతూ నటించిన మొదటి హిందీ చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్ధా’ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలరాజు అనే సైనికుడి పాత్రలో చై కనిపించనున్నాడు. తాజాగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలోనూ ఓ సినిమా ఒప్పుకొన్నట్లు   ప్రకటించాడు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది డిసెంబరులో విడుదల చేసేందుకు చిత్రబృందం సమాయత్తమవుతోంది.


వరుస సినిమాలతో..  

యువ హీరోల్లో మెరుపు వేగంతో సినిమాలు తీస్తున్న కథా నాయకుడు ఆది. ఒకటీ రెండూ కాదు ఆది నటిస్తున్న నాలుగు చిత్రాలు 2022లో ప్రేక్షకులకు కనువిందు చేసే అవకాశముంది. వీరభద్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘కిరాతక’, తర్వాత హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ‘తీస్‌మార్‌ ఖాన్‌’ మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ ఆది సరసన పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయికగా నటిస్తుండటం విశేషం. థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ‘బ్లాక్‌’, ‘జంగిల్‌’  సినిమాలూ ఈ ఏడాదే రానున్నట్లు ఆ చిత్ర వర్గాలు ప్రకటించాయి. జి.బి.దర్శకత్వంలో వస్తున్న ‘బ్లాక్‌’ చిత్రంలో ఆది పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు.



                                    

ముచ్చటగా మూడుతో...  

2022 ప్రయాణాన్ని నిఖిల్‌ సిద్ధార్థ్‌ ‘18 పేజెస్‌’తో మొదలుపెట్టనున్నాడు. సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటించింది. పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. దీని తర్వాత గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘స్పై’ దసరా పోటీలో నిలవనుంది. ఇది నిఖిల్‌ కెరీర్‌లోనే తొలి పాన్‌ ఇండియా చిత్రం. ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్‌’ వంటి థ్రిల్లర్‌ చిత్రాలకు ఎడిటర్‌గా వ్యవహరించిన గ్యారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై భారీ   అంచనాలున్నాయి. నిఖిల్‌కు గుర్తుండిపోయే విజయాన్ని ఇచ్చిన చిత్రం ‘కార్తికేయ 1’. దీనికి కొనసాగింపుగా అదే కాంబినేషన్‌లో వస్తున్న ‘కార్తికేయ 2’ జులైలో విడుదల కానుంది. ఇందులో అనుపమా  పరమేశ్వరన్‌, స్వాతి కథానాయికలుగా నటిస్తున్నారు.


దూకుడు పెంచి..

త్వరలో ‘కృష్ణ వ్రింద విహారి’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాగశౌర్య. దీనికి యువ దర్శకుడు అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించాడు. షెర్లీ సేథియా ఈ సినిమాతో టాలీవుడ్‌లో కథానాయికగా పరిచయమవుతోంది. ఈమె సొంతంగా తెలుగులో డబ్బింగ్‌ చెబుకుంటోంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి సున్నితమైన కథలతో మెప్పించిన శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో శౌర్య నటిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్‌ను ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’గా చిత్ర బృందం ప్రకటించింది. దీనితో పాటు కె.పి. రాజేందర్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘పోలీసు వారి హెచ్చరిక’ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు