Tollywood: క్రేజీ ప్రాజెక్టులు పట్టాలెక్కేశాయ్‌.. ‘పుష్ప 2’ అలా.. ‘ఉగ్రం’ ఇలా

కెమెరా క్లిక్‌లు, క్లాప్‌ చప్పుళ్లతో చిత్ర పరిశ్రమలో సోమవారం సందడి నెలకొంది. పలు సినిమాల చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది.

Published : 22 Aug 2022 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెమెరా క్లిక్‌లు, క్లాప్‌ చప్పుళ్లతో చిత్ర పరిశ్రమలో సోమవారం సందడి నెలకొంది. పలు సినిమాల చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. భారతీయ సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప 2’ ఈరోజే పట్టాలెక్కి, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంకా ఏఏ సినిమాలు మొదలయ్యాయంటే..

 భారీ అంచనాలతో పుష్ప 2  

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కించిన ‘పుష్ప: ది రైజ్‌’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దాంతో ఆ చిత్రానికి సీక్వెల్‌ అయిన ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa: The Rule)పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రారంభమవుతుందా? అని  అల్లు అర్జున్‌ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ ‘ఈసారి మరింత పెద్దగా, గ్రాండ్‌గా’ అని చిత్ర బృందం క్యాప్షన్‌ పెట్టింది. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపింది. హీరోహీరోయిన్లు అల్లు అర్జున్‌, రష్మిక బిజీగా ఉండటం వల్ల ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు.


 అప్పుడు నాంది.. ఇప్పుడు ఉగ్రం

‘నాంది’తో మంచి విజయాన్ని అందుకుని, క్రేజీ కాంబినేషన్‌ జాబితాలో చేరారు నటుడు అల్లరి నరేశ్‌ (Allari Naresh), దర్శకుడు విజయ్‌ కనకమేడల. ప్రస్తుతం ఈ ఇద్దరు ‘ఉగ్రం’ (Ugram) అనే సినిమా చేస్తున్నారు. దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి తదితరులు ముఖ్య అతిథులుగా ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌ రాజు క్లాప్‌ కొట్టగా అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. దామోదర్‌ ప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


 కొత్త దర్శకుడితో నాగశౌర్య 

నాగశౌర్య (Naga Shaurya) హీరోగా ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో పవన్‌ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యుక్తి తరేజా కథానాయిక. దర్శకులు రాఘవేంద్రరావు, శ్రీకాంత్‌ ఓదెల అతిథులుగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా టైటిల్‌, సాంకేతిక నిపుణలు వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.


కోటీశ్వరులుగా ఎలా మారారు?

హాస్య నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా అంజన్‌ చెరుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సుమీత కథానాయిక. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రారంభమైన ఈ సినిమా వేడుకకు దర్శకులు బి. గోపాల్‌, రేలంగి నరసింహారావు తదితరులు అతిథులుగా విచ్చేశారు. మధ్య తరగతి ప్రేమజంట అవకాశాల్ని చేజిక్కుంచుకుని కోటీశ్వరులుగా ఎలా మారింది? అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు