Dhamaka: రవితేజతో ప్రయోగం చేయాలనుకోలేదు!

‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలు మెండుగా ఉన్న చిత్రం ‘ధమాకా’. ఈ సినిమాతో పాత రవితేజను ప్రేక్షకులు మళ్లీ చూస్తార’’న్నారు త్రినాథరావు నక్కిన. 

Updated : 18 Dec 2022 06:55 IST

‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలు మెండుగా ఉన్న చిత్రం ‘ధమాకా’ (Dhamaka). ఈ సినిమాతో పాత రవితేజను ప్రేక్షకులు మళ్లీ చూస్తార’’న్నారు త్రినాథరావు నక్కిన(Trinadha Rao Nakkina). ‘నేను లోకల్‌’, ‘సినిమా చూపిస్త మావ’, ‘హలోగురు ప్రేమకోసమే’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు రవితేజతో (Raviteja) కలిసి ‘ధమాకా’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు దర్శకుడు త్రినాథరావు.

‘‘రవితేజ శైలికి తగ్గ పక్కా కమర్షియల్‌ సినిమా ‘ధమాకా’. ఆయన్ని ప్రేక్షకులు తెరపై ఎలా చూడాలనుకున్నారో ఈ చిత్రంలో అలాగే చూపించాను. తనతో ఎలాంటి ప్రయోగాలు చేయాలని అనుకోలేదు. ఈ విషయాన్ని రవితేజకు కూడా చెప్పాను. ఈ మధ్య ఆయన విభిన్నమైన పాత్రలు చాలా ప్రయత్నించారు. అందుకే ప్రేక్షకులు పాత రవితేజను ఎక్కడో మిస్‌ అయ్యారు. అందుకే ఈ చిత్రంతో మళ్లీ ఆ రవితేజను చూపించాలని అనుకుంటున్నానని ఆయనకు చెప్పా. తనకీ ఇది నచ్చింది’’.

రెండు ఎనర్జీలు కలిస్తే!

‘‘మేము ‘రౌడీ అల్లుడు’ లాంటి చిత్రం చేద్దామని చేసిన ప్రయత్నమిది. ఇందులో రవితేజ రెండు పాత్రల్లో కనిపిస్తారు. కథానాయిక మాత్రం ఒక్కరే. ఆమె చివరికి ఎవరికి దక్కుతుందో సినిమా చూసి తెలుసుకోవాలి (నవ్వుతూ). సినిమాలో రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. రవితేజ ఎనర్జిటిక్‌ హీరో. నా సినిమాలూ ఎనర్జిటిక్‌గానే ఉంటాయి. ఈ రెండు ఎనర్జీలు కలిస్తే ఎలా ఉంటుందనేది ఈ ‘ధమాకా’తో చూస్తారు. అందుకే ఈ చిత్రానికి ‘డబుల్‌ ధమాకా’ అనే క్యాప్షన్‌ పెట్టాం’’.

అందరికీ నచ్చే చిత్రం చేస్తే చాలు..

‘‘పాన్‌ ఇండియా కథలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. అందరికీ నచ్చే చిత్రం చేయగలిగితే చాలు. ఎందుకంటే భావోద్వేగాలు ప్రతి చోటా ఒకేలా ఉంటాయి.  ప్రస్తుతం నేను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నా. అలాగే కృష్ణ, దిల్‌రాజు నిర్మాణంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని