Trisha: 14 ఏళ్ల తర్వాత ఆ స్టార్‌ హీరో సరసన త్రిష.. అంచనాలు పెంచుతోన్న ప్రాజెక్టు!

నటి త్రిష ఓ భారీ ప్రాజెక్టులో కథానాయికగా ఎంపికైంది. అదే సినిమా? హీరో ఎవరో తెలియాలంటే ఇది చదివేయండి...

Published : 01 Feb 2023 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెరీర్‌ ప్రారంభించి 20 ఏళ్లు అవుతున్నా అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు నటి త్రిష (Trisha). గతేడాది వచ్చిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’, లేడీ ఓరియెంటెడ్‌ సినిమా ‘రాంగీ’తో అలరించిన ఆమె ఖాతాలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో చిత్రం చేరింది. అదే ‘దళపతి 67’ (Thalapathy 67) (వర్కింగ్‌ టైటిల్‌). కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay)తో దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న వారి వివరాలను మంగళవారం ప్రకటించిన చిత్రబృందం ఇప్పుడు కథానాయికగా త్రిష నటిస్తోందని వెల్లడించింది. ఆన్‌ స్క్రీన్‌పై విజయ్‌- త్రిష జోడీకు మంచి క్రేజ్‌ ఉంది. 2004లో వచ్చిన ‘ఘిల్లి’ (తెలుగు సినిమా ఒక్కడు రీమేక్‌)లో వారిద్దరు తొలిసారి కలిసి నటించారు. మరుసటి ఏడాది ‘తిరుపాచి’లో, 2006లో ‘ఆది’ (తెలుగు సినిమా అతనొక్కడే రీమేక్‌), 2008లో వచ్చిన ‘కురువి’లో మెరిశారు. సుమారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు.

‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ విశేష గుర్తింపు పొందారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. తన మల్టీవర్స్‌లో ‘దళపతి 67’ను భాగం చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అర్జున్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రియా ఆనంద్‌ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తుండడంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. జనవరి 2న ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని