ఆ ముగ్గురి మల్టీస్టారర్‌‌ ‘గంగోత్రి’గా మారింది!

కథానాయకుడిగా అల్లు అర్జున్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘గంగోత్రి’. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. నేటితో ఈ చిత్రం 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘గంగోత్రి’ గురించి కొన్ని ఆసక్తకర విశేషాలు మీకోసం.

Updated : 07 Dec 2022 17:22 IST

కథానాయకుడిగా అల్లు అర్జున్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘గంగోత్రి’. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. నేటితో ఈ చిత్రం 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘గంగోత్రి’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం...

అది 2002వ సంవత్సరం. అప్పటికి 99 సినిమాలు పూర్తి చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 100వ చిత్రాన్ని భారీగా రూపొందించాలనుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో మల్టీస్టారర్‌ చేయాలని భావించి రచయిత చిన్నికృష్ణతో కథ సిద్ధం చేయించారు. చిరు, నాగ్‌, వెంకీ కూడా సినిమా చేసేందుకు ఓకే అన్నారు. ఆ కథకి పెట్టిన పేరే ‘త్రివేణి సంగమం’. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌తో చెప్పగా.. ‘ఎందుకొచ్చిన టెన్షన్‌ బావ. 100వ సినిమా హాయిగా తీసుకోవచ్చు కదా ’ అని బదులిచ్చారు దత్‌. దాంతో ఈ కథని పక్కని పెట్టి కొత్త వాళ్లతో తీద్దామని నిర్ణయించుకున్నారు రాఘవేంద్రరావు. మరోసారి చిన్నికృష్ణకే కథ రాసే బాధ్యతనిచ్చారు. అదే మనం చూసిన, చూస్తున్న ‘గంగోత్రి’.

నాయకానాయికల అన్వేషణలో ముందుగా అదితి అగర్వాల్‌ ఖరారైంది. తన కుమారుడు ప్రకాశ్‌ చేసిన ఓ ఫొటో షూట్‌ ద్వారా అదితిని ఎంపిక చేశారు రాఘవేంద్రరావు. ‘త్రివేణి సంగమం’ నిర్మించాలనుకున్న అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌ ఈ కథనీ నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ సినిమాలో హీరోగా నటించేందుకు అర్జున్‌ అయితే బాగుంటుందని భావించారు. ఈ విషయం కాస్త రాఘవేంద్రరావుకి తెలిసింది.  ‘మెగా కుటుంబం నుంచి వచ్చే అబ్బాయి.. నాకు అభ్యంతరం ఏముంది. 100 శాతం చేద్దాం’ అని బన్నీతో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. అలా ముగ్గురు హీరోలతో తెరకెక్కాల్సిన రాఘవేంద్రరావు 100వ చిత్రం ‘గంగోత్రి’గా మారింది. 

 ఈ చిత్రానికిగానూ బన్నీ తీసుకున్న అడ్వాన్స్‌ రూ.100.
  అల్లు అరవింద్‌ తనయుడు, చిరంజీవి మేనల్లుడు అయినప్పటికీ ఈ సినిమాని అట్టహాసంగా ప్రారంభించకుండా చాలా సాధారణంగా మనాలి ప్రాంతంలో మొదలుపెట్టారు. రాఘవేంద్రరావు తొలి చిత్రం ‘బాబు’ కూడా అదే ప్రాంతంలో ప్రారంభమైంది.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని