Tollywood: ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో వచ్చే సినిమాలివే!

Tollywood: అటు థియేటర్‌లలో, ఇటు ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దామా!

Updated : 09 Aug 2021 16:26 IST

జూన్‌ చివరి వారంలో థియేటర్లలో సినిమా సందడి మొదలైన తర్వాత గత వారం కూడా పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. అదే ఉత్సాహంతో ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే భారీ బాలీవుడ్‌ చిత్రాలన్నీ ఓటీటీల వేదికగా వస్తుండటం గమనార్హం. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని అటు థియేటర్‌లలో, ఇటు ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దామా!

కనబడుట లేదు అంటున్న సునీల్‌

నటుడు సునీల్‌ కీలక పాత్రలో తెరకెక్కిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కనబడుటలేదు’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్‌ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ప్రేమకథ కూడా జోడించి దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి డిటెక్టివ్‌గా సునీల్‌ ఏ కేసును టేకప్‌ చేశాడు? దాన్ని ఎలా పరిష్కరించాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


సిద్ధార్థ్‌ ‘ఒరేయ్‌ బామ్మర్ది

సిద్దార్థ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్ట్‌ రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కీలకపాత్ర పోషించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల అంతకంతకూ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న ‘ఒరేయ్‌ బామ్మర్ది’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సిద్దార్థ్‌ ఇందులో ట్రాఫిక్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. బైక్‌ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన యువకుడి పాత్రను జీవీ ప్రకాశ్‌ పోషించారు.


‘సుందరి’గా అలరించనున్న పూర్ణ

పూర్ణ, అర్జున్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌జీ గోగన దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక అందమైన అమ్మాయి జీవితంలో పురుషుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? కట్టుకున్న భర్త కూడా ఎందుకు నిందించాడు? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు.


ది కంజురింగ్‌: దెయ్యం నా చేత చేయించింది

ప్యాట్రిక్‌ విల్సన్‌, వెరా ఫార్మిగా తదితరులు కీలక పాత్రల్లో నటించిన అమెరికన్‌ సూపర్‌నేచురల్‌ హారర్‌ ఫిల్మ్‌ ‘ది కంజురింగ్‌: దెయ్యం నా చేత చేయించింది’. మైఖేల్‌ ఛవెస్‌ దర్శకత్వం వహించారు. జూన్‌లో అమెరికాలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


బ్రాందీ డైరీస్‌ కథ ఏంటి?

గరుడ శేఖర్‌నవీన్‌ వర్మ, కేవీ శ్రీనివాస్, రవీంద్రబాబు, దినేశ్‌, సునీత సద్గురు నటిస్తున్న చిత్రం ‘బ్రాందీ డైరీస్‌’. శివుడు దర్శకత్వం వహించారు. కలెక్టివ్‌ డ్రీమర్స్‌ పతాకంపై లీలా శ్రీకాంత్‌ నిర్మించారు. యువతను ఆకట్టుకునేలా కథ, కథానాలను తీర్చిదిద్దిన ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది.

‘పాగల్‌’ ప్రేమకథతో విష్వక్‌సేన్‌

విభిన్న కథలతో చిత్ర పరిశ్రమను పలకరించిన యువ నటుడు విష్వక్‌సేన్‌. ఆయన కథానాయకుడిగా నరేశ్‌ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాగల్‌’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న ‘పాగల్‌’ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. బెక్కెం వేణు గోపాల్‌ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. సిమ్రాన్‌చౌదరి, మేఘాలేఖతోపాటు, రాహుల్‌ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.


ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే!

ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా థియేటర్లు తెరుచుకోని నేపథ్యంలో అనేక చిత్రాలు ఓటీటీ బాటపట్టాయి. ఈ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు చిత్రాలు ముఖ్యంగా దేశభక్తి చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

కార్గిల్‌ యుద్ధం నేపథ్యంలో ‘షేర్షా’

సిద్దార్థ మల్హోత్రా, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘షేర్షా’. విష్ణువర్ధన్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, క్యాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కార్గిల్‌ యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో సిద్ధార్థ్‌ విక్రమ్‌ భత్రా/విశాల్ భత్రాగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు పొందిన కెప్టెన్‌ విక్రమ్‌ భాత్రా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై మంచి అంచనాలను పెంచుతోంది.


లాక్‌డౌన్‌ కష్టాలు.. వివాహ భోజనంబు...

హాస్య నటుడు సత్య కీలక పాత్రలో రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వివాహ భోజనంబు’. యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌, కె.ఎస్‌.శినిష్‌తో కలిసి నిర్మించారు. పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాళ్ల ఇంట్లోనే ఉండిపోతే, వారి పరిస్థితి ఏంటి? పెళ్లికొడుకు కొడుకు, అతని కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


నెట్రికన్‌తో నయనతార ‘సాహసం’

స్టార్‌ కథానాయిక నయనతార ప్రధానపాత్రలో నటించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘నెట్రికన్‌’. మిలింద్‌ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న డిస్నీఫ్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందమైన అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేసి.. చిత్రహింసలు పెట్టి వాళ్ల చావును కళ్లారా చూసి ఆనందించే ఓ సైకో పాత్రలో అజ్మల్‌ నటించారు. పోలీసులకు చిక్కకుండా తిరిగే ఈ సైకో కథకు ఓ అంధురాలు ఎలా ఫుల్‌స్టాఫ్‌ పెట్టింది అనే ఉత్కంఠభరితమైన కథ, కథానాలతో ‘నెట్రికన్‌’ తీర్చిదిద్దారు.


భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా

భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోన్న మరో వార్‌ డ్రామా ‘భుజ్: ది ప్రైడ్‌ ఆఫ్ ఇండియా’. అజయ్‌ దేవ్‌గణ్‌, సంజయ్‌దత్‌, శరద్‌ ఖేల్కర్‌, సోనాక్షి సిన్హా, ప్రణీత, నోరా ఫతేహి, అమ్మీ వ్రిక్‌ ఇలా భారీ తారాగణంతో అభిషేక్‌ దుదియా దీన్ని తెరకెక్కించారు. థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఓటీటీ బాట పట్టింది. 1971 ఇండో-పాక్‌ వార్‌ సందర్భంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ చూస్తుంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆగస్టు 15న నేపథ్యంలో వార్‌ డ్రామా కథతో వస్తున్న ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇవి కూడా...

ఆగస్టు 11

బేక్‌ స్క్వాడ్‌ -నెట్ ఫ్లిక్స్‌

ది కిస్సింగ్‌ బూత్‌3- నెట్‌ఫ్లిక్స్‌

మిషా అండ్‌ ది వోల్వ్స్‌- నెట్‌ఫ్లిక్స్‌

వాట్‌ ఇఫ్‌..? -డిస్నీ+ హాట్‌ స్టార్‌

ఆగస్టు 13

బెక్కెట్‌ - నెట్‌ఫ్లిక్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని