upcoming telugu Movies: RRR వాయిదా.. ఈ సినిమాలు వచ్చేస్తున్నాయి!

upcoming telugu Movies: ఈ సంక్రాంతి సీజన్‌లో సందడి చేసేందుకు వస్తున్న తెలుగు సినిమాలివే!

Updated : 03 Jan 2022 14:31 IST

upcoming telugu Movies: సరిగ్గా ఐదారు నెలల క్రితం ఈసారి సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల జాబితాను చూసి థియేటర్లు దద్దరల్లిపోతాయని అందరూ అనుకున్నారు. కానీ, ఒక్కో సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ఆఖరి నిమిషంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలను కూడా వాయిదా వేయడంతో తెలుగు సినీ ప్రేక్షకులకు కాస్త నిరాశపడ్డారు. అయితే, ‘మేమున్నాం బాసూ’ అంటూ పలు చిత్రాలు వరుసగా ఈ సంక్రాంతి సీజన్‌లో సందడి చేసేందుకు వస్తున్నాయి. అవేంటో చూసేయండి.

‘అతిథిదేవోభవ’ అంటున్న ఆది

ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అతిథిదేవోభవ’. నువేక్ష కథానాయిక. పొలిమెర నాగేశ్వర్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్‌’ విడుదల వాయిదా అని ప్రకటించిన మరుసటి రోజే ‘అతిథిదేవోభవం’ విడుదల తేదీని ప్రకటించారు,. లవ్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.


స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే ఆసక్తికర కథతో..

రానా హీరోగా సత్యశివ తెరకెక్కించిన పీరియాడిక్‌ డ్రామా చిత్రం ‘1945’. సి.కల్యాణ్‌ నిర్మించారు. రెజీనా కథానాయిక. సత్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించింది. కానీ కుదరలేదు. ‘ఆర్ఆర్ఆర్‌’ వాయిదాతో ఇప్పుడు జనవరి 7న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రానా ఇందులో స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ డైరెక్టర్‌.



సడెన్‌గా సంక్రాంతి రేసులోకి వచ్చిన ఈ సినిమాలివే!

ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ‘రాధేశ్యామ్‌’ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. దీంతో పాటు ‘బంగార్రాజు’ కూడా వస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా పడటంతో వరుసగా నాలుగైదు సినిమాలు సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్నాయి.

థియేటర్‌లలో ‘సూపర్‌ మచ్చి’

చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిమైంది. రియా చక్రవర్తి, రుచితా రామ్‌ కథానాయికలుగా నటించారు. రొమాంటిక్‌ కామెడీ రూపొందిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా/లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. తాజాగా సినిమా సంక్రాంతి రేసులో నిలిచింది. జనవరి 14 ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


‘డిజె టిల్లు’ కూడా..

సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘డిజె టిల్లు’. నేహాశెట్టి నాయిక. విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమాని  జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.


జనవరి 15న వస్తున్న ‘హీరో’

మహేష్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘హీరో’ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జనవరి 26న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి ‘ఆర్ఆర్‌ఆర్‌’ తప్పుకోవడంతో హీరో కూడా వస్తానని అంటున్నాడు.


కాలేజీ ప్రేమలు.. విద్యార్థుల గొడవలు

ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా హర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశిదేవ్‌ విక్రమ్‌, కార్తిక్‌ రత్నం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాలేజీ ప్రేమలు.. ఆ ప్రేమ కోసం విద్యార్థుల మధ్య జరిగే కొట్లాటలు తదితర అంశాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. విడుదల తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నారు.


సంక్రాంతి రేసులో ‘7 డేస్‌ 6 నైట్స్‌’

‘డర్టీ హరి’ చిత్రంతో దర్శకుడిగా మారి, తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు. ఇప్పుడాయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’. సుమంత్‌ అశ్విన్‌, మెహర్‌ చాహల్‌ నాయకానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్‌లలో విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!

ఒకేసారి ఓటీటీలోకి నాగశౌర్య రెండు చిత్రాలు

యువ కథానాయకుడు నాగశౌర్య నటించిన ‘లక్ష్య’, ‘వరుడు కావలెను’ చిత్రాలు ఒకేసారి ఓటీటీలో విడుదలవుతున్నాయి. స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘లక్ష్య’.. ‘ఆహా’లో 2022 జనవరి 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ కథకు సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. ఇక నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు జీ5  ఓటీటీ వేదికగా జనవరి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* ద టెండర్‌ బార్‌ (హాలీవుడ్) జనవరి 07

ఎంఎక్స్‌ ప్లేయర్‌

* క్యాంపస్‌ డైరీస్‌ (హిందీ సిరీస్‌) జనవరి 07

సోనీ లివ్‌

* క్యూబికల్స్‌ (హిందీ సిరీస్‌) జనవరి 07

జీ5

* కౌన్‌ బనేగీ షికార్వతి (హిందీ సిరీస్‌) జనవరి 07

నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్స్‌

* మదర్‌/ఆండ్రాయిడ్‌ (హాలీవుడ్‌) జనవరి 07

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని