telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

Upcoming movie in telugu: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలయ్యే సినిమాల జాబితా ఇదే!

Updated : 22 Nov 2022 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కేసుల విజృంభణతో నెమ్మదించిన సినిమాల విడుదల క్రమంగా పుంజుకొంటోంది. కేసులు తగ్గుముఖం పట్టడం కూడా చిత్ర పరిశ్రమకు సానుకూల పరిణామం. మరి ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దామా!

‘ఖిలాడీ’ ఏం చేశాడు?

ఈ సారి సినీప్రియులకు ఫుల్‌ కిక్‌ అందిస్తానంటూ దూసుకొస్తున్నారు కథా నాయకుడు రవితేజ. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖిలాడి’. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. అర్జున్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేసింది. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రవితేజ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌, జీకే విష్ణు.


‘ఎఫ్‌ఐఆర్‌’ కథేంటి?

విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ, ఆయన స్వయంగా నిర్మించిన డార్క్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’. మను ఆనంద్‌ దర్శకుడు. కథానాయకుడు రవితేజ సమర్పిస్తున్నారు. అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగ్రవాదం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ కథలో ఉగ్రదాడికి పాల్పడింది ఎవరు? ద్రోహి అనే ముద్ర ఎవరిపై పడిందనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  మంజిమామోహన్‌, రెబా మోనికాజాన్‌ తదితరులు నటించారు.


కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘సెహరి’. అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు. కోటి, అభినవ్‌ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘ఇదొక చక్కని రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులోని కథ, పాత్రలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటాయి. హర్ష్‌ కొత్తవాడైనా అనుభవమున్న నటుడిలా చేశారు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించాం. ఈ సినిమా కుటుంబ సమేతంగా వెళ్లి హాయిగా చూడగలిగేలా ఉంటుంది’’అని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అరవింద్‌ విశ్వనాథ్‌.


అట్లుంటది మనతోని అంటున్న ‘డీజే టిల్లు’

‘ఒక ల్యాండ్‌ ఉన్నది. అది మన సొంతము.. మన పర్సనల్‌ అనుకున్నా నేను.. కానీ, అది ఊళ్లో వాళ్ల అందరి పేరు పైనా ఉంది’ అంటూ నవ్వులు పంచుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘డిజె టిల్లు’. నేహాశెట్టి నాయిక. విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ విడుదల పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రిన్స్‌, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, మాటలు: సిద్ధు జొన్నలగడ్డ, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్‌ ఉమ్మడిసింగు. వీటితో పాటు ‘మహా ప్రళయం-2022’ హాలీవుడ్‌ చిత్రం.. ‘రచ్చ రచ్చ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాలివే!

తండ్రీకొడుకులు ఒకే తెరపై..

తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రమ్‌ (Vikram). తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ (Dhruv Vikram)తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘మహాన్‌’(Mahaan). కార్తీక్‌ సుబ్బరాజు దర్శకుడు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా  ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ప్రైమ్‌ వేదికగా ‘మహాన్‌’ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.


చాలా డేంజరస్‌ హౌస్‌ వైఫ్‌.. ‘భామాకలాపం’

ప్రియమణి కీలక పాత్రలో అభిమన్యు తెరకెక్కించిన చిత్రం ‘భామా కలాపం’ (BhamaKalapaam). క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా  ‘ఆహా’లో ప్రసారం కానుంది. గృహిణిగా, పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా ప్రియమణి  ప్రచార చిత్రాల్లో కనిపించారు. ప్రతివారం ఓ కొత్త వంటకం చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసే ఆమె, తొలిసారి ఓ స్పెషల్‌ వంటకాన్ని చేయాల్సి వస్తుంది. అది ఏంటి? ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఫిబ్రవరి 11న ‘భామాకలాపం’ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది.


కేవలం ఓటీటీ కోసమే తీసిన చిత్రం

బాలీవుడ్‌ నటులు దీపికా పదుకొణె- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ చిత్రం ‘గెహ్రాహియా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, స్నేహం, వ్యక్తిగత సంబంధాల వాటి పరిణామాల చుట్టూ కథను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. దీపిక-సిద్ధాంత్‌ ప్రణయ సన్నివేశాలతో సినిమాను హాట్‌హాట్‌గా తీర్చిదిద్దారు. కేవలం ఓటీటీ కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం.


‘మళ్లీ మొదలైంది’ అంటున్న సుమంత్‌

సుమంత్‌, వర్షిణీ సౌందర్‌ రాజన్‌, నైనా గంగూలి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్‌ తెరకెక్కించారు. రాజశేఖర్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఓటీటీ వేదిక జీ5లో విడుదల కానుంది. ‘‘విడాకులు తీసుకున్న ఓ యువకుడు.. తన న్యాయవాదితో ఎలా ప్రేమలో పడ్డాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఈ చిత్ర కథాంశం. ఇందులో సుమంత్‌ భార్యగా వర్షిణీ కనిపించనుండగా.. న్యాయవాది పాత్రను నైనా పోషించింది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: శివ.


అప్పుడు థియేటర్లలో.. ఇప్పుడు ఓటీటీలో

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘హీరో’. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు, నటుడు మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌ హీరోగా పరిచయమైన సినిమా ఇది. నిధి అగర్వాల్‌ కథానాయిక. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. ఈ యాక్షన్‌ కామెడీ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌

* ఐ వాంట్‌ యూ బ్యాక్‌(హాలీవుడ్‌ ఫిబ్రవరి 11)

నెట్‌ఫ్లిక్స్‌

* క్యాచింగ్‌ కిల్లర్స్‌ (వెబ్‌ సిరీస్‌ సీజన్‌-2) ఫిబ్రవరి 9

* ఇన్వెంటింగ్‌ అన్నా (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి11

* లవ్‌ అండ్‌ లీషెస్‌ (కొరియన్‌) ఫిబ్రవరి 11

* టాల్‌ గర్ల్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి11

* ద ప్రివిలేజి (హాలీవుడ్)ఫిబ్రవరి11

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

స్నో డ్రాప్‌ (కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 9

జీ5

* సింగ పెన్నే (తమిళ్‌) ఫిబ్రవరి 9

సోనీ లివ్‌

* ఫ్రీడమ్‌ ఫైట్‌ (మలయాళం) ఫిబ్రవరి 11

ఎంక్స్‌ ప్లేయర్‌

* ప్రకటన (తెలుగు) స్ట్రీమింగ్‌

* రక్తాంచల్‌ (హిందీ) ఫిబ్రవరి 11

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని