Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

Cinema news: ఈ వారం థియేటర్‌లో ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలివే!

Published : 19 Oct 2021 01:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లలో సినిమాల కళకళ నెమ్మదిగా పెరుగుతోంది. దసరాకు ముందు, పండగ సందర్భంగా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే, ఈసారి ఎక్కువగా చిన్న చిత్రాలు వస్తుండటం గమనార్హం. ఇక ఓటీటీలోనూ ఇంకొన్ని సినిమాలు సందడి చేయటానికి సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా!

వెండితెరపై భావోద్వేగాల ‘నాట్యం’

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 22న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకకు వచ్చిన రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. కేవలం భరతనాట్యం గురించి మాత్రమే కాకుండా.. అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయని, దాని కోసమైనా ఈ చిత్రం చూడాలని అన్నారు. కమల్‌కామరాజ్‌, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మేనన్‌ తదితరులు నటించారు.


అసలేం జరిగింది అంటున్న శ్రీరామ్‌

య‌ధార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అస‌లేం జ‌రిగింది’. శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా న‌టించిన ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఓ అదృశ్య శక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రమని, 1970- 80ల్లో తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల‌ ఆధారంగా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుందని పేర్కొంది.


‘మధుర వైన్స్‌’లో మొదలైన ప్రేమకథ

నూతన నటీనటులు సన్నీ నవీన్‌, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మధురవైన్స్‌’. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జయకిషోర్‌ దర్శకత్వం వహించారు.  అక్టోబరు 22న దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. మద్యానికి బానిసైన ఓ యువకుడు.. ఆ వాసన అంటేనే పడని ఓ యువతి. వీళ్లద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది. ఆ మద్యం కారణంగా వీళ్ల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరి ఆ ప్రేమజంట శాశ్వతంగా విడిపోయిందా..? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మధుర వైన్స్‌’.


ముగ్గురు అమ్మాయిల తలరాతలు ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’

సునీల్‌, సుహాస్‌ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేది ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.


క్రేజీ ‘లవ్‌స్టోరీ’ ఓటీటీలో..

నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్లవి జంటగా క్లాస్‌ డైరెక్టర్‌ శేఖ‌ర్ క‌మ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా నాగచైతన్య, సాయిపల్లవి నటన, శేఖర్‌ కమ్ముల టేకింగ్‌, ఎంచుకున్న పాయింట్‌ యువతను ఆకట్టుకుంది. ‘సారందరియా’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అక్టోబరు 22న సాయంత్రం 6గంటల నుంచి ‘లవ్‌స్టోరీ’ అందుబాటులో ఉంటుందని ‘ఆహా’తెలిపింది.


ఓటీటీలో వచ్చే మరికొన్ని చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్‌

* రత్నన్‌ ప్రపంచం(కన్నడ) అక్టోబరు 22

నెట్‌ఫ్లిక్స్‌

* లాకే అండ్‌ కీ (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 22

డిస్నీ+హాట్‌ స్టార్‌

* సక్సెషన్‌(వెబ్‌సిరీస్‌) అక్టోబరు 18

* ఓవ్‌ మనపెన్నే(తమిళం) అక్టోబరు 22

హెచ్‌బీవో మ్యాక్స్‌

* డ్యూన్‌(హలీవుడ్‌) అక్టోబరు 22

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని