Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

Tollywood: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల వివరాలు ఇవే

Updated : 28 Oct 2021 22:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దసరా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వెండితెరపై చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిత్రాలు థియేటర్‌లవైపు క్యూ కడుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు ఓటీటీలోనూ ఇంకొన్ని సినిమాలు సందడి చేయటానికి సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా!

ఆగి ఆగి వస్తున్న ‘రొమాంటిక్‌’

ఆకాష్‌ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్‌ పాడూరి తెరకెక్కించిన చిత్రం ‘రొమాంటిక్‌’. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో విడుదల కానుంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. యువతను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇటీవల ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి సునీల్‌ కశ్యప్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


మరో ఫీల్‌గుడ్‌ మూవీతో నాగశౌర్య

నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌభాగ్య దర్శకురాలిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబరు 29న థియేటర్‌లలో విడుదలకు సిద్ధమైంది. ‘దిగు దిగు దిగు నాగ’ పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.


రెండు జంటల ‘తీరం’

అనిల్‌ ఇనమడుగు కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘తీరం’. శ్రావణ్‌ వై.జి.టి మరో కథా నాయకుడు. క్రిస్టెన్‌ రవళి, అపర్ణ కథానాయికలు. యం.శ్రీనివాసులు నిర్మాత. ఈ చిత్రాన్ని సినేటెరియా గ్రూప్‌ సంస్థ అధినేత వెంకట్‌ బోలేమోని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘ప్రేమ, రొమాంటిక్‌ అంశాలతో కూడిన చిత్రమిది. రెండు జంటల నేపథ్యంలో సాగుతుంది. సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది’ అని దర్శకుడు అనిల్‌ అంటున్నారు.


‘రావణ లంక’లో ఏం జరిగింది?

క్రిష్‌ బండిపల్లి, అస్మిత కౌర్‌ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’. మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బి.ఎన్‌.ఎస్‌.రాజు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉజ్జల కుమార్‌ సాహా స్వరాలు సమకూరుస్తున్నారు. విహారయాత్ర కోసం వెళ్లి నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశారు? అది హత్య? ఆత్మహత్య? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


థియేటర్లలో చూడాల్సిన ‘జై భజరంగి 2’

కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ హీరోగా  ఏ.హర్ష తెరకెక్కించిన చిత్రం ‘జై భజరంగి 2’. 2013లో వచ్చిన ‘భజరంగి’కి సీక్వెల్‌గా రూపొందింది. నిరంజన్‌ పన్సారి నిర్మించారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఏడు నెలల క్రితం టీజర్‌ చూశాను. ఇంత భారీ చిత్రాన్ని  తెలుగులోనూ ఆదరిస్తారని గ్రహించి.. ఇక్కడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నా. ఇదొక విజువల్‌ వండర్‌. దీన్ని థియేటర్లలోనే చూడాలి. అప్పుడే ఆ అనుభూతి తెలుస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో టి.ప్రసన్న కుమార్‌, కరుణాకర్‌ రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు. సంగీతం: అర్జున్‌ జన్య, ఛాయాగ్రహణం: స్వామి జె.గౌడ.


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే

అమెజాన్‌ ప్రైమ్‌

* డైబుక్‌(హిందీ) అక్టోబరు 29

నెట్‌ఫ్లిక్స్‌

లాభం(తమిళం) అక్టోబరు 24

హిప్నోటిక్‌, అక్టోబరు 27

ఆర్మీ ఆఫ్‌ దీవ్స్‌ , అక్టోబరు 29

జీ5

ఆఫత్‌ ఈ ఇష్క్‌(హిందీ) అక్టోబరు 29

సోనీలివ్‌

ఫ్యామిలీ డ్రామా(తెలుగు చిత్రం)అక్టోబరు 29

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

హమ్‌ దో హమారే దో(హిందీ) అక్టోబరు 29

ఆల్ట్‌ బాలాజీ

గిర్‌గిట్‌(వెబ్‌సిరీస్‌) అక్టోబరు 27

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని