Tollywood: రంగంలోకి దిగిన చిరంజీవి.. ‘ఎఫ్‌ 3’ డబ్బు పాట!

‘గాడ్‌ ఫాదర్’, ‘ఎఫ్‌ 3’ చిత్రాల అప్‌డేట్స్‌. చిరంజీవి, వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ పంచుకున్న విశేషాలివీ...

Published : 06 Feb 2022 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల కరోనా బారిన పడిన ప్రముఖ నటుడు చిరంజీవి పూర్తిగా కోలుకున్నారు. రెట్టింపు ఉత్సాహంతో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘నాకు కొవిడ్‌ నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. ఎంతో ఉత్సాహంతో మళ్లీ పని మొదలుపెట్టా’’ అంటూ ‘గాడ్‌ ఫాదర్’ సినిమా సెట్స్‌లో దిగిన ఫొటోల్ని షేర్‌ చేశారు. పొలిటిక్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. సత్యదేవ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది.

 లబ్‌డబ్‌ లబ్‌డబ్‌ డబ్బు.. 

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా రూపొందుతోంది. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ‘లబ్‌డబ్‌ లబ్‌డబ్‌ డబ్బు’ అనే పాటకు సంబంధించి ప్రోమోను ఆదివారం విడుదల చేసింది. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని రామ్‌ మిర్యాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. పూర్తి పాట ఫిబ్రవరి 7న విడుదలకానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని