Samyuktha: మా నాన్న ఇంటి పేరు మాకొద్దు.. అందుకే తీసేశాం: సంయుక్త

తన జీవితం, కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి సంయుక్త (Samyuktha). చిన్నప్పటి నుంచి తాను కష్టాలు చూశానని, దానివల్లే ఎమోషనల్‌ సీన్స్‌లో నటించడం తనకి ఇబ్బంది అనిపించదని అన్నారు.

Updated : 09 Feb 2023 13:00 IST

హైదరాబాద్‌: ‘భీమ్లానాయక్‌’ (Bheemla Nayak)తో తెలుగువారికి చేరువైన కేరళ బ్యూటీ సంయుక్త (Samyuktha). ఇందులో ఆమె రానా సతీమణిగా నటించి తెలుగు సినీ ప్రియుల మెప్పు పొందారు. ప్రస్తుతం ఈ భామ ధనుష్‌ (Dhanush) హీరోగా నటిస్తోన్న ‘సార్‌’ (SIR) కోసం పనిచేస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ లభించింది. ఈ నేపథ్యంలో సంయుక్త ఓ కోలీవుడ్‌ వెబ్‌సైట్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె తన లైఫ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంయుక్తా మేనన్‌గా ఉన్న తన పేరును కేవలం సంయుక్తగా మార్చుకోవడానికి గల కారణాన్ని వివరించారు.

‘‘నా పేరు వెనుక మేనన్‌ను (Samyuktha) కొనసాగించకూడదనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. స్కూల్‌లో చేరినప్పుడు ఇంటిపేరుతో సహా మన పేరు రాస్తుంటారు. అలాగే నాక్కూడా సంయుక్త మేనన్‌ అనే పేరును నమోదు  చేశారు. అప్పట్లో దాని గురించి అంతగా అవగాహన లేదు. రాను రాను.. ఒక వ్యక్తి పేరు వెనుక ఎందుకు ఇలాంటి తోకలు ఉండాలి? అనే ఆలోచన నాలో మొదలైంది. నటికి ఉండాల్సిన బాధ్యతలు గ్రహించిన తర్వాత ఇంటిపేరును కొనసాగించకూడదని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా, నా తల్లిదండ్రులు ఎంతోకాలం క్రితం విడాకులు తీసుకున్నారు. మా నాన్న ఇంటి పేరుని కొనసాగించడం అమ్మకు ఇష్టం లేదు. నా తల్లి భావాలను గౌరవించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాను. నా సోషల్‌మీడియా ఖాతాలు, నేను నటించే సినిమాల్లోనూ సంయుక్తగానే ఉంటుంది’’

‘‘నటిగా విలక్షణమైన పాత్రల్లో నటించాలనే ఆలోచన నాకు ఉంది. అందుకు అనుగుణంగా కెరీర్‌ మొదలైన నాటి నుంచి విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నా. ఇక, ‘సార్‌’ (SIR)లో నా పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందర్నీ అలరిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో సినిమా ఎమోషనల్‌గా సాగుతుంది. నా పాత్రకు ఎమోషనల్‌ సీన్స్‌ ఎక్కువ. చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. అందువల్ల ఎమోషనల్‌ సీన్స్‌లో నటించడం నాకు సవాలుగా అనిపించలేదు’’ అని ఆమె వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని