Vijay: థియేటర్‌లో విజయ్‌ ‘తలైవా’ అని కేకలు వేశారు

స్టార్‌ హీరో అయినప్పటికీ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి ఓ బాలీవుడ్‌ చిత్రాన్ని విజయ్‌ వీక్షించారని నటి మాళవికా మోహన్‌ తెలిపారు. విజయ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని మంగళవారం సదరు...

Published : 24 Jun 2021 00:58 IST

ఆయన ఆనందం చూసి ఆశ్చర్యపోయా

చెన్నై: విజయ్‌ స్టార్‌ హీరో అయినప్పటికీ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి ఓ బాలీవుడ్‌ చిత్రాన్ని వీక్షించారని నటి మాళవికా మోహన్‌ తెలిపారు. విజయ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని మంగళవారం సదరు హీరో టీమ్‌ ఓ స్పెషల్‌ ట్విటర్‌ సెషన్‌ ఏర్పాటు చేసింది. ఈ సెషన్‌లో పలువురు తారలతో పాటు విజయ్‌ కూడా పాల్గొన్నారు. హీరోయిన్లు కీర్తి సురేశ్‌, మాళవికా మోహనన్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌, ‘బీస్ట్‌’ దర్శకుడు దిలీప్‌కుమార్‌ పాల్గొని విజయ్‌తో తమ సినీ ప్రయాణాన్ని పంచుకున్నారు.

కాగా, సెషన్‌లో భాగంగా విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని, ‘మాస్టర్‌’ కోసం ఆయనతో కలిసి పనిచేయడం గురించి నటి మాళవికా మోహన్‌ తెలియజేశారు. అంతేకాకుండా ఆ సినిమా చిత్రీకరణ సమయంలో చోటుచేసుకున్న ఓ మధుర జ్ఞాపకాన్ని అందరితో పంచుకున్నారు. ‘‘మాస్టర్‌’కు సంబంధించిన ఓ షెడ్యూల్‌ కొన్నిరోజులపాటు ముంబయిలో జరిగింది. సాధారణంగా విజయ్‌ సర్‌.. చెన్నైలోని థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడడం జరగని పని. దానివల్ల ముంబయిలో షూట్‌ పూర్తైన వెంటనే టీమ్‌ అందరితో కలిసి ఆయన థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ నటించిన ‘బాఘీ-3’ విడుదలయ్యింది. దాంతో మేమంతా ఆ సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లాం. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఆయన ఆనందం చూసి నేను ఆశ్చర్యపోయాను. టైగర్‌ ష్రాఫ్‌ ఎంట్రీ సీన్‌కి.. ‘నా తలైవా’ అంటూ విజయ్‌.. సాధారణ ప్రేక్షకుడిలా కేకలు వేశారు. ఒక స్టార్‌ హీరోని అలా చూసి నేను షాకయ్యాను. టైగర్‌ ష్రాఫ్‌ అంటే తనకెంతో ఇష్టమని విజయ్‌ మాతో చెప్పారు’ అని మాళవికా మోహన్‌ వివరించారు.

లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ‘మాస్టర్‌’ తర్వాత విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘బీస్ట్‌’. దిలీప్‌కుమార్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విజయ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘బీస్ట్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో విజయ్‌ గన్‌ను పట్టుకొని మాస్‌లుక్‌లో కనిపించారు. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధం కానున్న ఈ సినిమాలో పూజాహెగ్డే, డస్కీ సిరెన్‌ కథానాయికలు. మరోవైపు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో విజయ్‌ కథానాయకుడిగా పాన్‌ ఇండియా మూవీ పట్టాలెక్కనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని