Shalini Pandey: విజయ్‌ దేవరకొండకు థ్యాంక్యూ చెప్పిన షాలినీ పాండే

‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) కోస్టార్‌ విజయ్‌ దేవరకొండకు (Vijay Deverakonda) నటి షాలినీ...

Published : 25 Aug 2022 12:10 IST

ఆసక్తికర పోస్ట్‌ పెట్టిన నటి

హైదరాబాద్‌: ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) కోస్టార్‌ విజయ్‌ దేవరకొండకు (Vijay Deverakonda) నటి షాలినీ పాండే (Shalini Pandey) కృతజ్ఞతలు చెప్పారు. ఆగస్టు 25 తన జీవితంలోనే కీలకమైన రోజంటూ ఆమె పేర్కొన్నారు. ‘‘ఈరోజుకి (ఆగస్టు 25) నా జీవితంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. సుమారు ఐదేళ్ల క్రితం ఇదే రోజున నేను నటిగా వెండితెరకు పరిచయమైన ‘అర్జున్‌ రెడ్డి’ విడుదలై ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించింది. ఆ సినిమాలో నేను పోషించిన ప్రీతి పాత్రకు మీ నుంచి వచ్చిన ప్రేమాభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞురాలినే. ‘అర్జున్‌ రెడ్డి’కి నేనెప్పటికీ రుణపడి ఉంటా. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు ధన్యవాదాలు. తొలి చిత్రం ఎలా చేస్తానోనని కంగారు పడుతోన్న నాలో ఉత్సాహాన్ని నింపి.. షూటింగ్ సరదాగా గడిచిపోయేలా చేశాడు నా సహనటుడు  విజయ్ దేవరకొండ. ‘లైగర్‌’.. నువ్వు చేసిన ప్రతి పనికి థ్యాంక్యూ. లవ్ యూ. అలాగే నీ కొత్త సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని షాలినీ రాసుకొచ్చారు.

సందీప్‌ రెడ్డి వంగా - విజయ్‌ దేవర కొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్‌ చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. షాలినీ పాండే కథానాయిక. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకొంది. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని స్టూడెంట్‌గా, ప్రియురాలికి దూరమై, మద్యానికి బానిసైన వ్యక్తిగా విజయ్‌ నటన అందర్నీ ఆకట్టుకొంది. విజయ్‌ కెరీర్‌లో ఈ సినిమా ఓ భారీ హిట్‌గా నిలిచింది. సుమారు రూ.5 కోట్ల బడ్జెట్‌తో సిద్ధమైన ఈసినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని