నమ్ముకున్నవాళ్లే చేతులెత్తేశారు.. చిరంజీవి నాకోసం రూ.58 లక్షలు ఖర్చుపెట్టారు: పొన్నాంబళం

ఘరానా మొగుడు’, ‘అల్లరి ప్రియుడు’, ‘మెకానిక్‌ అల్లుడు’ వంటి సినిమాల్లో విలన్‌గా కనిపించి.. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు నటుడు పొన్నాంబళం (Ponnambalam). తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Updated : 24 May 2023 14:47 IST

హైదరాబాద్‌: తాను తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నమ్ముకున్నవాళ్లెవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదని నటుడు పొన్నాంబళం (Ponnambalam) అన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) వల్లే తానింకా ప్రాణాలతో ఉన్నానని, ఆయన లేకపోతే తన పరిస్థితి దారుణంగా ఉండేదని ఆయన చెప్పారు. తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చిరంజీవి, ఆయన కోడలు ఉపాసన చేసిన సాయాన్ని వివరించారు.

‘‘కొన్నేళ్ల క్రితం నేను నిర్మించిన మూడు సినిమాలు పరాజయం చెందాయి. ఎంతో నష్టపోయాను. అదే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. కిడ్నీలు పాడైపోయాయి. డయాలసిస్‌ చేయించుకోవడానికి కూడా నా వద్ద డబ్బు లేదు. శరత్‌కుమార్‌, ధనుష్‌ కొంత డబ్బు పంపించారు. ఓసారి చిరంజీవి గుర్తుకువచ్చారు. ఆయనకు ఫోన్‌ చేసి నా పరిస్థితి వివరించాను. ఆయన వెంటనే నా ఖాతాలో కొంత డబ్బు వేశారు. ఆ తర్వాత అపోలో ఆస్పత్రికి వెళ్లమని చెప్పారు. ఉపాసన కూడా నాకు ఫోన్‌ చేశారు. ‘నేను రామ్‌చరణ్‌ మిసెస్‌ ఉపాసన. మామయ్య మీ గురించి చెప్పారు ఆస్పత్రికి వెళ్లండి’ అని ఆమె అన్నారు. ఆమె మాటకు ఆశ్చర్యపోయాను. చెన్నై అపోలో ఆస్పత్రిలో నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. దానికోసం చిరంజీవి రూ.58 లక్షలు ఖర్చుచేశారు. నేనింకా ప్రాణాలతో ఉన్నానంటే దానికి పూర్తి కారణం చిరంజీవి. నా దృష్టిలో ఆయనే నాకు పునర్జన్మ ఇచ్చారు’’ అని పొన్నంబలం వివరించారు. ఇప్పుడిప్పుడే తాను కోలుకుంటున్నానని, త్వరలోనే షూట్‌కూ వెళ్తానని చెప్పారు. ఇకపై ఫైట్‌ సీన్స్‌ కాకుండా కేవలం కమెడియన్‌, సహాయనటుడి పాత్రల్లో కనిపిస్తానని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని