టబుని ఎందుకు నిందిస్తున్నారు..?

ఓ సినిమా విషయంలో ప్రముఖ నటి టబుని నిందిస్తూ వస్తోన్న వార్తలపై బాలీవుడ్‌ చిత్ర దర్శకుడు అనీస్‌ బాజ్మీ స్పందించారు. అసలు టబుని ఎందుకు నిందిస్తున్నారో అర్థం కావడం ఆయన అన్నారు....

Published : 21 Feb 2021 14:40 IST

నటిపై వార్తలు.. స్పందించిన దర్శకుడు

ముంబయి: ఓ సినిమా విషయంలో ప్రముఖ నటి టబుని నిందిస్తూ వస్తోన్న వార్తలపై బాలీవుడ్‌ చిత్ర దర్శకుడు అనీస్‌ బాజ్మీ స్పందించారు. అసలు టబుని ఎందుకు నిందిస్తున్నారో అర్థం కావడం ఆయన అన్నారు. టబు, కార్తిక్‌ ఆర్యన్‌, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భూల్‌ భులయ్యా-2’. అనీస్‌ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ గతేడాది ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. అనంతరం అక్టోబర్‌లో తిరిగి ప్రారంభం కావాల్సిన షూట్‌ కాస్త జనవరికి మరోసారి వాయిదా వేశారు. దీంతో, సినిమాలో ఎంతో కీలకమైన టబు షూట్‌కు వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడమే ‘భూల్‌ భులయ్యా-2’ ఆలస్యానికి కారణమంటూ ఎన్నో పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్‌ లేదంటూ అందరూ చెప్పుకున్నారు.

తమ సినిమా గురించి ఎంతో కాలం నుంచి వస్తోన్న వార్తలపై తాజాగా దర్శకుడు స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని అన్నారు. ‘మా సినిమా తిరిగి పట్టాలెక్కకపోవడానికి టబుని ఎందుకు నిందిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ సినిమా షూట్‌ కోసం ఆమె ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఆమె షూట్‌కు రానని ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే, పది నెలల నుంచి నేనే ముంబయిలో లేను. కరోనా పరిస్థితుల రీత్యా కుటుంబంతో కలిసి మా ఫామ్‌హౌస్‌కు వెళ్లాను. కథలు రాసుకుంటూ అక్కడే సమయాన్ని గడిపాను. ఇటీవలే ముంబయికి చేరుకుని చిత్రబృందాన్ని, నటీనటుల్ని కలిశాను. షూట్‌ ప్రారంభిస్తే వెంటనే సెట్‌లోకి వచ్చేస్తామని వాళ్లందరూ నాతో చెప్పారు. ఈ నెల చివరి వారంలో తప్పకుండా మా చిత్రాన్ని పట్టాలెక్కిస్తాము’ అని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని