RRR: ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’... అదనంగా డబ్బులు చెల్లించాలా?

ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ

Published : 16 May 2022 01:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘RRR’. ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో మే 20న జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది. ఇప్పటికే జీ5 సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారు మే 19 అర్ధరాత్రి నుంచి ఉచితంగా చూడాలా? లేక అద్దె ప్రాతిపదికన అదనంగా చెల్లించి చూడాలా? అన్న దానిపై స్పష్టత లేదు. జీ5 ట్విటర్‌ అప్‌డేట్స్‌ను బట్టి మొదట కొన్ని రోజుల పాటు అద్దె ప్రాతిపదికన ఈ సినిమాను అందించనున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి జీ5 చేసే ప్రతి ట్వీట్‌లోనూ T-VOD-(ట్రాన్సాక్షనల్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుందని జీ5 చెబుతోంది. అంటే డబ్బులు చెల్లించి చూడాల్సిందేనన్నమాట.

ఇదే విషయమై ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు జీ5 సపోర్ట్‌ టీమ్‌ సమాధానం ఇచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ జీప్లెక్స్‌లో అద్దె ప్రాతిపదికన అందిస్తున్నట్లు తెలిపింది. స్ట్రీమింగ్‌ యాప్‌ వేదికగా ప్రీమియర్‌ మొదలైన తర్వాత మీకు సౌకర్యవంతమైన సమయంలో సినిమాను అద్దెకు తీసుకుని చూడవచ్చని సూచించింది.  ఇక కొత్తగా సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకోవాలనుకునే వారి ఎదుట జీ5 రెండు ఆప్షన్లను ఉంచింది. జీ5 12 నెలల ప్లాన్‌ ప్రస్తుతం రూ.599 లభిస్తుండగా, ‘RRR’ సినిమా చూడాలనుకుంటే అదనంగా రూ.100 చెల్లించి మొత్తం రూ.699 పెట్టి సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి. ఇలా ‘RRR’తో కలిసి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ఆ మూవీ వ్యాలిడిటీ 7 రోజుల పాటు ఉంటుంది. వాచ్‌ టైమ్‌ వ్యాలిడిటీ 24 గంటలు మాత్రమే. దీనిని బట్టి చూస్తే ప్రస్తుతం జీ5 సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు కూడా ‘RRR’ వచ్చిన వెంటనే చూడాలంటే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్ధతి ఎన్నిరోజులు అమలులో ఉంటుందో తెలియదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని