Kamal Haasan: ‘భారతీయుడు2’ ప్లాట్‌ రివీల్‌ చేసిన రచయిత.. తెరవెనుక కమల్‌ కష్టం!

కమల్‌హాసన్‌ కీలక పాత్రలో శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు2’ గురించి ఆ సినిమా సహ రచయిత జయమోహన్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Updated : 14 Dec 2022 18:15 IST

హైదరాబాద్‌: ‘ఇండియన్‌2’ (Indian 2).. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఆసక్తికర ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 25ఏళ్ల కిందట వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి కొనసాగింపుగా శంకర్‌ (Shankar) దీన్ని తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను రచయిత బి.జయమోహన్‌ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా, అందులోని పాత్ర కోసం ప్రాణం పెట్టే కమల్‌హాసన్‌ (Kamal Haasan) సీక్వెల్‌ కోసం కూడా తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు.

‘‘ఇండియన్‌2’ (Indian 2) షూటింగ్‌ మొదలైన దగ్గరి నుంచి సెట్స్‌లో కమల్‌ ఆకలితోనే ఉంటున్నారు. మేకప్‌ వేసుకున్న తర్వాత పేకప్‌ చెప్పేవరకూ ఆయన తినడానికి వీలు లేదు. ఒకవేళ ఏదైనా తినడానికి, నమలడానికి ప్రయత్నిస్తే, ఆయన వేసుకున్న ప్రొస్థటిక్‌ మేకప్‌ దెబ్బతింటుంది. షూటింగ్‌ సమయంలో కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటున్నారు. ఆయన్ను చూస్తుంటే నాకైతే ఎంతో బాధగా ఉంది’’ అని జయమోహన్‌ తెలిపారు.

స్వాతంత్య్రభారతంలో లంచాల అక్రమార్కుల భరతంపట్టే  ‘భారతీయుడు తాత’గా కమల్‌హాసన్‌ (Kamal Haasan) అద్భుతంగా నటించారు. కన్నకొడుకే లంచగొండి అని తెలిసినా అతడిని మట్టుబెట్టడానికి వెనుకాడని పాత్రలో ఆయన నటన మెప్పించింది. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న తీవ్రమైన సమస్యపై పోరాటం చేసేందుకు మళ్లీ సేనాపతి భారతదేశానికి వస్తే? ఏం చేస్తాడన్న ఇతివృత్తంతో తాజాగా సినిమాను శంకర్‌ తీస్తున్నారు.

‘‘భారతీయుడు’ చూసిన అనుభూతినే ‘ఇండియన్‌2’ (Indian 2) కూడా ఇస్తుంది. తొలి భాగంలో స్వాతంత్య్రానికి పూర్వం ఏం జరిగిందో చూపించారు. తాజా చిత్రంలో స్వాతంత్య్రానంతరం ఏ జరిగింది? అప్పట్లో సేనాపతికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిపై ఎలా పోరాటం చేశాడు? అన్నది చూపించబోతున్నారు. మొదటి చిత్రంలో తండ్రీ-కొడుకుల మధ్య జరిగే సంఘర్షణను ఆవిష్కరించారు. రెండో భాగంలో సేనాపతి తండ్రిని కూడా చూస్తాం’’ అంటూ ఆసక్తికర విషయాన్ని జయమోహన్‌ వెల్లడించారు.

‘ఇండియన్‌2’ కోసం దర్శకుడు శంకర్‌తో పాటు, జయమోహన్‌, కబిలిన్‌ వైరముత్తు, లక్ష్మీ శరవణన్‌ కుమార్‌లు రచయితలుగా పనిచేస్తున్నారు. ‘భారతీయుడు’ క్లైమాక్స్‌లో సేనాపతి తప్పించుకున్నట్లు చూపించారు. ‘భారతదేశానికి తన అవసరం వచ్చినప్పుడు తప్పక తిరిగి వస్తానని చెబుతాడు’ మరి ఆ అవసరం ఏంటన్నది తెరపైనే చూడాలి. 2019లో ‘భారతీయుడు2’ షూటింగ్‌ మొదలుకాగా, ఎన్నో అవాంతరాలను దాటుకుని, చిత్రీకరణ జరుపుకొంటోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్టులో సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని