yvs chowdary: వాళ్లే బాధ్యత వహించాలి

‘‘గ్యాప్‌లు మనం తీసుకోం.. అవి వస్తుంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. ఫలితంగా ఏదోక సమయంలో కొన్ని విరామాలు తప్పవు. ఇప్పుడు నాకొచ్చిన విరామమూ అలా వచ్చిందే’’ అంటున్నారు...

Updated : 24 May 2021 08:51 IST

‘‘గ్యాప్‌లు మనం తీసుకోం.. అవి వస్తుంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. ఫలితంగా ఏదోక సమయంలో కొన్ని విరామాలు తప్పవు. ఇప్పుడు నాకొచ్చిన విరామమూ అలా వచ్చిందే’’ అంటున్నారు వైవీఎస్‌ చౌదరి. ‘సీతారామరాజు’, ‘యువరాజు’, ‘సీతయ్య’, ‘దేవదాస్‌’ వంటి విజయవంతమైన చిత్రాలతో చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడాయన. ‘రేయ్‌’ సినిమా తర్వాత కాస్త విరామం తీసుకున్న ఆయన.. ఇప్పుడు తనదైన శైలిలో ఓ తెలుగుదనం నిండిన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన విలేకర్లతో ఆన్‌లైన్‌ వేదికగా ముచ్చటించారు వైవీఎస్‌ చౌదరి.

ఓ దర్శకుడిగా జయాపజయాలు, విరామాల విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
‘‘ఓ వ్యక్తి ప్రతిభకు జయాపజయాలు కొలమానాలు కావని నమ్మే వ్యక్తిని నేను. ఎప్పుడైనా పరాజయం ఎదురైనా.. అది ఆ ఒక్క ఉత్పాదకతకే పరిమితం. అంతేకాని మన కృషిలోనూ..  సృజనాత్మకతలోనూ ఫెయిలైనట్లు కాదు. ఏ దర్శకుడైనా సరే..   ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవడం ముఖ్యం. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోంది.. సినిమా ఎలా రూపాంతరం చెందుతోంది.. ప్రేక్షకుల అభిరుచుల్లో ఎలాంటి మార్పులొస్తున్నాయి..? ఇలాంటివన్నీ గమనిస్తుండాలి. మొదటి నుంచీ నేను అనుసరిస్తున్న సిద్ధాంతమిది. కెరీర్‌ ఆరంభంలో పదేళ్లకు పైగా తెలుగు నేటివిటీకి దూరంగా ఉన్నా.. వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు తీయగలిగానంటే కారణం నేను నమ్మిన ఈ సిద్ధాంతమే. నేనిప్పటికీ ఇదే ఫాలో అవుతున్నా. ఈ మధ్య చిత్రసీమకి కాస్త దూరమైనా.. పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ వస్తున్న మార్పులను తెలుసుకుంటున్నా’’.

మరిప్పుడున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కథ సిద్ధం చేశారా?
‘‘ప్రస్తుతం నేనొక అందమైన ప్రేమకథ సిద్ధం చేశా. తెలుగు వారి సంస్కృతి - సంప్రదాయాలు ఉట్టిపడేలా.. తెలుగు వాళ్ల వాడి-వేడి ప్రతిబింబించేలా.. స్క్రిప్ట్‌ రాసుకున్నా. దీంట్లో మధురమైన సంగీతంతో పాటు తేనెలూరే సాహిత్యమూ మిళితమై ఉంటుంది. వీలైనంత తక్కువ సమయంలో   ప్రేక్షకులకు ఆసక్తిరేకెత్తించేలా ఈ సినిమాని ముస్తాబు చేయాలని   ప్రణాళిక రచిస్తున్నా. దాదాపు కొత్తవాళ్లతోనే ఈ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నా. కథానాయికగా ఓ పదహారణాల తెలుగమ్మాయిని తీసుకోవాలని నిర్ణయించుకున్నా. నిజానికి గతేడాదే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలి అనుకున్నా. కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల ఆలస్యమైంది. మళ్లీ ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ దెబ్బ కొట్టింది. ఈ పరిస్థితులు కుదుటపడగానే చిత్రీకరణ ప్రారంభిస్తా’’.

ప్రస్తుతం దర్శకులంతా వెండితెరతో పాటు డిజిటల్‌ వేదికల వైపు దృష్టి సారిస్తున్నారు. మరి మీరు?
‘‘2012లో రవితేజ హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘నిప్పు’ చిత్రం నిర్మించా. ఆ సమయంలోనే కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ వెండితెరపైనా, బుల్లితెరపైనా, డిజిటల్‌ వేదికలపైనా వినోదం అందించాలని నిర్ణయించుకున్నా. కానీ, నా ‘రేయ్‌’ చిత్రం రకరకాల కారణాలతో ఆలస్యమవడం వల్ల ఆ ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. అయితే ఇప్పుడా ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. నా బొమ్మరిల్లు బ్యానర్‌ ద్వారా అన్ని రకాల వినోద వేదికలపైనా కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ.. కొత్త కంటెంట్‌ను చూపించాలనుకుంటున్నా. ఇందుకోసం ఓ టీమ్‌ని కూడా సిద్ధం చేశా’’.

ఈ కొవిడ్‌ పరిస్థితుల నుంచి చిత్రసీమ తిరిగి కోలుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చనుకుంటున్నారు?
‘‘కొవిడ్‌ ఉద్ధృతి ఎప్పుడు తగ్గుతుందన్న దానిపై   శాస్త్రవేత్తల్లోనే సరైన స్పష్టత లేదు. గతంలో మాస్కులు, శానిటైజర్లు వాడితే మహమ్మారిని అడ్డుకోవచ్చన్నారు. తర్వాత వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే కరోనాని నివారించొచ్చన్నారు. ఇప్పుడు ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా..
జాగ్రత్తగా ఉండక తప్పదంటున్నారు. దేనిపైనా పూర్తిస్థాయి స్పష్టత కనిపించడం లేదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా.. మనం   ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లాల్సిందే. నాకు తెలిసి.. వ్యాక్సినేషన్‌ సమర్థంగా పూర్తయ్యి, పరిస్థితులన్నీ కుదుట పడితే మరో మూడు నుంచి ఆరు నెలల్లో చిత్ర పరిశ్రమ కాస్త కుదుట పడొచ్చు అనుకుంటున్నా’’.

దేశంలో కరోనా ఈస్థాయిలో విజృంభించడానికి కారణాలేంటి అనుకుంటున్నారు?
‘‘ముందు చూపు లేకపోవడమే ఈ దుస్థితికి కారణం. ఈ విషయంలో ప్రత్యేకంగా ఏ ఒక్కరినో నిందించలేం. కరోనా రెండో దశ ఇంత ఉద్ధృతిలో లేకపోయుంటే.. ‘మనది కర్మ భూమి, అందుకే రాలేదు’ అని స్టేట్‌మెంట్లు వచ్చుండేవి. అలా జరగలేదు కాబట్టి.. ముందే ఎందుకు హెచ్చరించలేదని అడిగే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా మనం పరిపాలన ఒకరి చేతుల్లో పెట్టాం కాబట్టి.. ప్రస్తుత పర్యావసానాలన్నింటికీ వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని