
న్యూయార్క్ అసెంబ్లీకి జెనిఫర్ రాజ్కుమార్!
దక్షిణాయాసియా నుంచి తొలిసారి ఎన్నిక కానున్న మహిళగా రికార్డు!
న్యూయార్క్: అమెరికాలో జరుగుతున్న రసవత్తర పోరులో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. ఈ ఎన్నికల్లో న్యూయార్క్ నుంచి 38 ఏళ్ల ఇండో అమెరికన్ న్యాయవాది జెనిఫర్ రాజ్కుమార్ డెమొక్రాట్ అభ్యర్థిగా బరిలో దిగి తన ప్రత్యర్థి గియోవన్నీ పెర్నాపై విజయం సాధించారు. దీంతో దక్షిణాసియా నుంచి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నిక కానున్న తొలి మహిళగా ఆమె నిలిచారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన జెనిఫర్.. వలసదారుల హక్కుల న్యాయవాదిగా మంచి గుర్తింపు పొందారు. తాజాగా న్యూయార్క్ నగరం నుంచి జనరల్ అసెంబ్లీకి ఎన్నికకానున్న ఆమె.. వుడ్హెవెన్, రిజ్వుడ్, రిచ్మాండ్ హిల్, ఓజోన్ పార్క్, గ్లెన్డేల్లతో కూడిన 38వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
జెనిఫర్ రాజ్కుమార్ న్యాయవాదిగానే కాకుండా న్యూయార్క్లోని సిటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గానూ పనిచేస్తున్నారు. అలాగే, న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ అధికారిణి కూడా. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చి న్యూయార్క్ సమీపంలోని క్వీన్స్లో స్థిరపడ్డారు. 2015, 2016లలో ఆమె న్యూయార్క్ మెట్రో రైజింగ్ స్టార్స్ జాబితాలో సూపర్ లాయర్గా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అలాగే, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆమెను ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల డైరెక్టర్గా, న్యూయార్క్ స్టేట్ ప్రత్యేక న్యాయవాదిగా నియమించారు.
దక్షిణాసియా నుంచి తొలిసారి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికవుతున్న మహిళగా నిలిచిన జెనిఫర్ రాజ్కుమార్కు ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ అభినందనలు తెలిపింది. ఆమె ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగిగానే కాకుండా లీగల్ అడ్వకేట్గా సేవలందించారని ట్విటర్లో పేర్కొంది. అల్బానీలో దక్షిణాసియా గొంతుకను వినిపించే బలమైన న్యాయవాది ఉంటున్నారని మనకు తెలుసు’’ అంటూ ట్వీట్లో పేర్కొంది.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.