
హెచ్-4 వీసా ప్రక్రియలో సుదీర్ఘ జాప్యం
నిరసనగా ర్యాలీ చేపట్టిన ప్రవాస భారతీయ మహిళలు
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్ల లోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్-4 వీసాలను కొన్ని వర్గాల వారికి జారీ చేసే విషయంలో సుదీర్ఘ జాప్యం చోటుచేసుకుంటుండటంపై అక్కడి ప్రవాస భారతీయ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వేల సంఖ్యలో స్త్రీలు ఉపాధికి దూరమవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. దీనికి నిరసనగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో ‘సేవ్ హెచ్4ఈఏడీ’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. సాధారణంగా అమెరికాలో ఉద్యోగం ఆధారంగా చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను కోరే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినవారికి హెచ్-4 వీసాలను అందిస్తుంటారు. బైడెన్ పాలనలో వాటిని అందించే విషయంలో ఆలస్యం జరుగుతోందని ‘సేవ్ హెచ్4ఈఏడీ’ నిర్వాహకులు పేర్కొన్నారు. ‘‘అమెరికా మా స్వస్థలం. జీవితంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసించాం. కుటుంబాలను పోషించాం. నైపుణ్యమున్న చట్టబద్ధమైన వలసదారులుగా సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు చేయూతను అందించాం’’ అని కార్యక్రమ ప్రధాన నిర్వాహకురాలు ప్రతిమా జొగ్లేకర్ చెప్పారు. శ్వేతజాతేతర మహిళలను అణగదొక్కి, వారి జీవనోపాధిని దోచుకునే ఏకపక్ష విధానాలకు ముగింపు పలకడంపై బైడెన్ ప్రభుత్వం దృష్టిసారించాలని కార్యక్రమానికి హాజరైనవారు అభ్యర్థించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్లిష్ట బయోమెట్రిక్ విధానం కూడా ఈ జాప్యానికి కారణమని, వెంటనే బైడెన్ యంత్రాంగం దాన్ని రద్దు చేయాలని కోరారు. హెచ్-1బీ, హెచ్-4 వీసాల కోసం ఒకేసారి దరఖాస్తు చేసినప్పుడు, వాటికి అనుమతులు కూడా ఏకకాలంలో మంజూరు చేయాలని అభ్యర్థించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.