
ట్రంప్ను ముంచింది ఆ మూడు కౌంటీలే..!
నోటి దురుసుకు ఫిలడేల్ఫియాలో ప్రతిఫలం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని మూడు కౌంటీలు శాసించాయి. ఈ కౌంటీల్లో లెక్కింపునకు ముందు ట్రంప్నకు ఆశలు ఉన్నా.. వాటిపై ఇవి నీళ్లు కుమ్మరించాయి. ఫలితంగా ఆయన మరో రెండు నెలల్లో శ్వేతసౌధాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన అమెరికా ఎన్నికల కౌంటింగ్లో ఇక్కడి ఆధిక్యం ఆధారంగానే తుదిఫలితం వెలువడటం విశేషం. మధ్యలో వచ్చిన ఆధిక్యం కూడా చివరిలో కోల్పోయారు. ఫలితంగా ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 47 ఎలక్టోరల్ ఓట్లను వదులుకోవాల్సి వచ్చింది.
ఈ కౌంటీ బ్లాక్లైవ్స్ మ్యాటర్కు కేంద్రబిందువు..
ట్రంప్ను షాక్కు గురిచేసిన వాటిల్లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫలితాలు ముఖ్యమైనవి. ఇక్కడ ఫిలడేల్ఫియా కౌంటీలో దాదాపు 15లక్షల మంది నివాసం ఉంటున్నారు. 7.5లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. దాదాపు 81శాతం ఓట్లు బైడెన్కు లభించగా.. శుక్రవారం ఉదయం ప్రకటించిన దాదాపు 30,000 బైడెన్ అనుకూల ఓట్లు ట్రంప్ ఆధిక్యాన్ని తారుమారు చేశాయి. అప్పటి వరకు ట్రంప్ మంచి ఆధిక్యంలో కొనసాగారు. ఈ రాష్ట్రం బైడెన్కు 20 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను అందించాయి. ఆయన శ్వేతసౌధంలో అడుగుపెట్టడానికి అవసరమైన శక్తిని ఇచ్చాయి.
‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి ఈ రాష్ట్రం పుట్టినిల్లు. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది ఆఫ్రో అమెరికన్లు కాగా.. 45 శాతం మంది శ్వేతజాతీయులు. ట్రంప్ ఈ ఉద్యమాన్ని ఒక బోగస్ వ్యవహారమని కొట్టిపారేశారు. ఒక దశలో వారిని వెక్కిరించారు. ఇప్పుడు వారు ఆ కసిని బ్యాలెట్ రూపంలో తీర్చుకొన్నారు. ఈ రాష్ట్రం మొత్తంలో కేవలం 8శాతం మాత్రమే ఆఫ్రో అమెరికన్లు ఉన్నారు. వీరిలో 92శాతం మంది బైడన్కు మద్దతు తెలిపారు. ఇక హిస్పానిక్లు మొత్తం ఓటర్లలో 4శాతం ఉండగా.. 78శాతం మంది డెమొక్రాట్లకు ఓటువేశారు. వీరి సంఖ్య మొత్తం ఓటర్లలో తక్కువ ఉన్నా.. దాదాపు గంపగుత్తగా బైడెన్ పక్షాన ఉండటంతో డెమొక్రాట్లు స్వల్పమెజార్టీతో విజయం సాధించారు.
అవమానానికి తగిన మూల్యం..
జార్జియాలోని అట్లాంటా ప్రాంతంలోని క్లేటోన్ కౌంటీ ట్రంప్నకు చుక్కలు చూపించింది. ఇది 5వ కాంగ్రెషియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. దీనికి 1987 నుంచి జాన్ లూయిస్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఈ ఏడాది జులైలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా వంటి మాజీ అధ్యక్షులు హాజరయ్యారు. ముఖ్యంగా ఒబామా లూయిస్ సేవలను కొనియాడారు. జాన్ సేవలను నిర్లక్ష్యం చేస్తూ ట్రంప్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. 5 డిస్ట్రిక్ట్లో దాదాపు ఆఫ్రో అమెరికన్లు అత్యధిక మంది ఉన్నారు. ఇది ఆఫ్రో అమెరికన్లకు జరిగిన అవమానంగా భావించారు. దానికి వారు గత వారంలో జరిగిన ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకొన్నారు. ఇక్కడ క్లేటౌన్ కౌంటీలో శుక్రవారం ఉదయం తొలిసారి బైడెన్కు 917 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇది జార్జియా రాష్ట్రంలో డెమొక్రాట్లను ముందుకు తీసుకెళ్లింది. క్లేటౌన్లో 85శాతం మంది బైడెన్కు ఓటు వేశారు. మిగిలిన డెకాల్బ్ కౌంటీలో 83శాతం డెమొక్రాట్లకు మద్దతు పలికారు. జార్జియాలో 30శాతం మంది ఓటర్లు ఆఫ్రో అమెరికన్లు.
మెక్కెయిన్ను అవమానించినందుకు..
తనను విమర్శిస్తున్నాడన్న కోపంతో సొంతపార్టీ సెనెటర్ జాన్ మెక్కెయిన్ను ట్రంప్ తరచూ అవమానించేవారు. మెక్కెయిన్ వియత్నాం యుద్దంలో పాల్గొన్న మాజీ సైనికుడు. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడేవారు. ట్రంప్ తీరును ఆయన నిర్మోహమాటంగా విమర్శించేవారు. ఇది నచ్చని ట్రంప్ ఆయన్ను చిన్నచూపు చూసేవారు. ఈ విషయాన్ని అరిజోనా రాష్ట్రంలో చాలా మంది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. 2018లో మెక్కెయిన్ కన్నుమూశారు. తాజాగా డెమొక్రాటిక్ పార్టీ తరపున మాజీ వ్యోమగామి మార్క్ కెల్లీ బరిలోకిదిగారు. లోకల్ హీరోగా.. వార్ వెటరన్ మెక్ కెయిన్ స్థానాన్ని కెల్లీ భర్తీ చేశారు. అంతేకాదు కెల్లీ భార్య గాబ్బీ గిఫోర్డ్స్ ఇక్కడి మారికోప కౌంటీ ఉన్న 8వ కాంగ్రెషియల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. అరిజోనా ప్రజల్లో 62 శాతం మంది ఇక్కడే ఉంటారు. అమెరికా అధ్యక్ష పదవి గెలిచేందుకు అరిజోనా ఓట్లు అవసరమైన వారికి ఈ కౌంటీ అత్యంత కీలకం. కానీ, 2012లో బుల్లెట్ గాయం కారణంగా ఆమె ఈ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ట్రంప్ ఈ కౌంటీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కడపుమండిన స్థానికులు డెమొక్రాటిక్ సెనెటర్ను గెలిపించడంతోపాటు.. జోబైడెన్కు పట్టం కట్టారు. మారికోప కౌంటీ నుంచి 19లక్షల ఓట్లు ట్రంప్కు వ్యతిరేకంగా పడ్డట్లు అంచనా. దీంతో రిపబ్లికన్లకు పట్టున్న అరిజోనా డెమొక్రాట్ల పరమైంది. ట్రంప్ ఓటమి ఖాయమైంది.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.