శాక్రమెంటోలో వినూత్నంగా వినాయక చవితి
పద్యాలు, శ్లోకాలతో ఆకట్టుకున్న విద్యార్థులు
శాక్రమెంటో: జనాన్ని కరోనా భయం వెంటాడుతున్న వేళ వినాయక చవితి వేడుకలు ఈసారి ఎలాంటి సందడి లేకుండానే జరిగాయి. ప్రజలు తమ ఇళ్లలోనే గణనాథుడికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించుకున్నారు. కానీ, అమెరికాలోని కాలిఫోర్నియాలోని ప్రవాస తెలుగువారు మాత్రం వినూత్నంగా జరుపుకొన్నారు. చిన్నారుల్లో తెలుగు భాషపై ఉన్న మక్కువను వెలికితీయడంతో పాటు వారిలోని ప్రతిభను చాటేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో నగరంలో "శాక్రమెంటో తెలుగు సంఘం" (టాగ్స్ ) ఆధ్వర్యంలో వర్చువల్ సమావేశం ద్వారా ఆగస్టు 22న "వినాయక చవితి శ్లోక పఠనం", ఆగస్టు 23న "పలికెద భాగవతం" కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు తెలుగు సంస్కృతి రత్నం పోతన భాగవతాన్ని వర్చువల్ సమావేశం ద్వారా 30 మంది విద్యార్థులు పఠించారు. గ్రేటర్ శాక్రమెంటో ప్రాంతానికి చెందిన ప్రవాస తెలుగు విద్యార్థులు పోతన భాగవతంలో ఒక పాదం/ మొత్తం పద్యాన్ని పాడటం ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2గంటల వ్యవధిలో ప్రవాస తెలుగు విద్యార్థులు పఠించిన బమ్మెర పోతన భాగవత కథ పద్యాలు, కృష్ణుడిని కీర్తించే మధురమైన పద్యాలు, వాటి తాత్పర్యం, శ్రావ్యమైన పాటలు అందరినీ అలరించాయి. తెలుగు భాష నేర్చుకోవడంపై తరువాతి తరం ఆసక్తిని అనుమానించేవారు సైతం తమ అభిప్రాయాన్ని మార్చుకునేవిధంగా ప్రవాస తెలుగు విద్యార్థులు ఆత్మవిశ్వాసం, వాగ్ధాటితో పద్యాలను పఠించడం విశేషం. ప్రముఖ నేపథ్య గాయకుడు, స్వరకర్త పార్థు నేమాని ప్రవాస తెలుగు పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో పాల్గొన్న ప్రతి విద్యార్థిని అభినందించడంతో పాటు వారి భవిష్యత్ ప్రదర్శనలకు ఆయన విలువైన సూచనలు ఇచ్చారు. ఈ అంతర్జాల సమావేశానికి హాజరైన 100 మందికి పైగా వీక్షకులతో పాటు తెలుగు సంస్కృతికి తమవంతు సేవ చేసేందుకు కరోనా సమయంలో కూడా ప్రవాస తెలుగు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి రావడం గొప్ప విషయమని ప్రశంసించారు. విద్యార్థులు చూపించిన ప్రతిభ, అద్భుతమైన తెలుగు సంస్కృతికి ఓ దీపపు స్తంభం వలే నిలుస్తుందని పలువురు వక్తలు కొనియాడారు.
"పలికెద భాగవతము" కార్యక్రమానికి సహకారమందించిన పార్థు నేమానికి టాగ్స్ కోశాధికారి మోహన్కాట్రగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ప్రవాస విద్యార్థి పఠించిన కవితల శైలులతో పాటు అర్థాన్ని తెలుసుకొని, భావాన్ని గ్రహించారని నిర్ధారించుకోవడానికి పార్థు నెలల ముందుగానే తన శిక్షణను ప్రారంభించారని టాగ్స్ అధ్యక్షుడు నాగ్ దొండపాటి ప్రశంసించారు. ప్రతివారం శిక్షణా సమావేశాలను నిర్వహించి, ఎల్లప్పుడూ తగిన సూచనలిస్తూ ప్రతి ప్రవాస విద్యార్థి కోసం పార్థు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారని ప్రశంసించారు. టాగ్స్ ట్రస్టీ వెంకట్ నాగం మాట్లాడుతూ.. "పిల్లలు చాలా చక్కగా పోతన భాగవతం పద్యాలు పాడటమే కాకుండా భావం కూడా వర్ణిస్తున్నారన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అందించిన టాగ్స్ కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు, గురువు పార్థుకు శుభాభినందనలు చెప్పారు. మరో వీక్షకుడు శ్యాం అరిబింది మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలను ప్రతి పల్లెలో పరిచయం చేయడం ద్వారా తెలుగు భాషను బతికించుకోవాలని సూచించారు. ఉచ్చారణ, పటిమ, శ్రవణ గ్రహణశక్తి వంటి కీలక విషయాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస తెలుగు పిల్లలు పురోగతి సాధించారని టాగ్స్ ట్రస్టీ మనోహర్ మందడి ప్రశంసించారు. విదేశాల్లో ఉంటూ తెలుగు భాషపైన, తెలుగు వారి సొత్తు అయిన పద్య పఠనం, గానంపై అత్యంత ఉత్సాహం చూపించే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దిన తల్లిదండ్రులు, గురువులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్టు మరో వీక్షకుడు శ్రీనివాస్ విశ్వనాథ పేర్కొన్నారు. అమెరికాలో ఉండి కూడా చక్కటి ఉచ్చారణతో బాగా చెప్పారని, ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన పార్థు అభినందనీయుడని అనురాధ చివుకుల అన్నారు.
ఆగస్టు 22న ఉదయం 10గంటలకు వినాయక శ్లోకాల పఠనం ఘనంగా జరిగింది. భారతదేశంలోని అతి పెద్ద పండుగలలో ఒకటైన వినాయకచవితి సందర్భంగా శ్లోక పఠనం కార్యక్రమాన్నిప్రత్యేకంగా ప్రవాస తెలుగు పిల్లల కోసం టాగ్స్ నిర్వహించింది. అంతర్జాల సమావేశం ద్వారా టాగ్స్ దీన్ని నిర్వహించి ఫేస్బుక్లో ప్రసారం చేసింది. స్థానికంగా ఉన్న 25 మందికి పైగా తెలుగు పిల్లలు గణపతిని స్తుతిస్తూ 50కి పైగా శ్లోకాలు, కీర్తనలు ఆలపించారు. ప్రవాస తెలుగు పిల్లలు అద్భుతమైన ప్రదర్శన ను ఇచ్చారని పలువురు వక్తలు ప్రశంసించారు. వీక్షకురాలు శ్రీదేవి దగ్గుల మాట్లాడుతూ.. పిల్లలు చక్కగా వినాయక శ్లోకాలు పఠించారన్నారు. ఈ అవకాశం కల్పించిన టాగ్స్ సంస్థకు అభినందనలు చెప్పారు. కొవిడ్ మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపిస్తున్న ఈ కష్ట కాలంలో ఈ అంతర్జాల సమావేశం ద్వారా ప్రవాస తెలుగు పిల్లలను శ్లోక పాఠనా కార్యక్రమం కోసం ఒకచోటకు చేర్చినందుకు మరో వీక్షకురాలు సుప్రియ పురిటిపాటి కృతజ్ఞతలు చెప్పారు. టాగ్స్ పిలుపును అందుకొని అతి తక్కువ సమయంలో తమ శ్లోకాలు, కీర్తనలతో వినాయక చవితి పండుగకు మరింత శోభ తెచ్చారని విద్యార్థులను టాగ్స్ అధ్యక్షులు నాగ్ దొండపాటి అభినందించారు. ఇందుకు సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సత్యవీర్ సురభి సమన్వయం చేశారు. కరోనా లేకపోతే టాగ్స్ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహంతో కోలాహలంగా వినాయక చవితి సంబరాలు జరుపుకొనేవాళ్లమని, వచ్చే ఏడాది వినాయకుడి దయవల్ల కరోనా అంతమైతే పూర్తిస్థాయిలో సంబరాలు జరుపుకోవాలని ఆశిద్దామని టాగ్స్ కోశాధికారి మోహన్ కాట్రగడ్డ ఆకాంక్షించారు. దాదాపు మూడు వేల మందికి పైగా స్థానిక సభ్యులు కలిగిన శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తికి 2003 నుంచి కృషిచేస్తోంది. టాగ్స్ కార్యక్రమాల గురించి మరింత సమాచారం కోసం టాగ్స్ వెబ్సైట్ http://www.sactelugu.org/ లేదా https://www.facebook.com/SacTelugu/ను సందర్శించాలని టాగ్స్ సమన్వయకర్త సత్యవీర్ సురభి సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Serena Williams: నేను అబ్బాయిని అయితే.. ఆటను వదిలిపెట్టేదాన్నే కాదు..!
-
General News
Menstrual Disturbances: నెలసరి చిక్కులెందుకో..? కారణాలు ఇవే..!
-
Movies News
Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్ఖాన్
-
World News
China: తైవాన్పై అవసరమైతే బలప్రయోగం తప్పదు..!
-
World News
Cuba: క్యూబా ప్రధాన చమురు నిల్వలో 40శాతం ఆహుతి..!
-
Sports News
Team India: భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లే కావాలి: మాజీ క్రికెటర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్ఖాన్
- UN: ఐరాస ఉగ్ర ఆంక్షల విధానాలపై మండిపడ్డ భారత్..!
- IIT Madrasలో రికార్డుస్థాయి ప్లేస్మెంట్లు..ఓ విద్యార్థికి ₹2కోట్ల వార్షిక వేతనం!
- Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Thief: ‘నన్ను క్షమించు తల్లీ’.. దేవతను వేడుకొని మరీ హుండీ ఎత్తుకెళ్లిన దొంగ
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు