Chennupati jagadish: తెలుగు వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

భారత సంతతికి చెందిన చెన్నుపాటి జగదీశ్‌ ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం పరిశోధకుడిగా కొనసాగుతున్నారు.

Published : 26 Nov 2021 01:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉన్నత విద్యాభ్యాసం కోసమో, ఉన్నత ఉద్యోగాల కోసమో దేశం దాటి విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులు ఆయా దేశాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. శాస్త్రవేత్తలుగా, విద్యావేత్తలుగా, రాజకీయనాయకులుగా ఇలా ఏరంగం చూసినా భారత సంతతి వ్యక్తులు తమదైన మార్క్‌తో రాణిస్తున్నారు. తాజాగా ఇదే జాబితాలోకి వచ్చిచేరారు భారత సంతతి వ్యక్తి. మరీ ముఖ్యంగా తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్‌. ప్రపంచంలోనే అత్యు్త్తమైన సైన్స్‌ అకాడమీలో ఒకటైన ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ అధ్యక్షుడిగా నియమితులై యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 

తెలుగు వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన చెన్నుపాటి జగదీశ్‌ ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం పరిశోధకుడిగా కొనసాగుతున్నారు. నానో టెక్నాలజీలో ప్రొఫెసర్‌ జగదీశ్‌ నిష్ణాతులుగా ఉన్నారు. 2022 మేలో ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. దీంతో ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి భారత సంతతి వ్యక్తిగా జగదీశ్‌ రికార్డు సృష్టించనున్నారు. ఈ అవకాశం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు జగదీశ్‌ అన్నారు. రెండు సంవత్సరాల కాంట్రాక్ట్‌తో 31 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని ఈ అకాడమీకి వచ్చానన్న జగదీశ్‌.. ఇప్పుడు దానికే నేతృత్వం వహిస్తానని అస్సలు అనుకోలేదని సంతోషం వ్యక్తం చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తానని జగదీశ్‌ స్పష్టం చేశారు. 

ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఆదేశంలో ప్రముఖ సైన్స్‌ అకాడమీ సైన్స్‌లో ఒకటిగా ఉంది. ఈ సంస్థ ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు శాస్త్రీయ సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇంతటి ప్రముఖమైన సైన్స్‌ సంస్థకు జగదీశే సరైన వ్యక్తి అని ఏఎన్‌యూ వీసీ, నోబెల్‌ గ్రహీత ప్రొఫెసర్‌ బ్రెయిన్‌ స్కిమిట్‌ ప్రశంసించారు. ఆయన చేతుల్లో ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ సురక్షితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. జగదీశ్‌ చెన్నుపాటి ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ ఫాబ్రికేషన్‌ ఫెసిలిటీకి డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఆస్ట్రేలియన్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ నుంచి ఫెడరేషన్‌ ఫెలోషిప్‌, లెరేట్‌ ఫెలిషిప్‌ సైతం లభించాయి. 

ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న చెన్నుపాటి జగదీశ్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బల్లూరుపాలెం అనే మారుమూల గ్రామం. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివిన జగదీశ్‌ 1977లో ఆంధ్రా వర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేశారు. 1988లో దిల్లీ వర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసి కొన్నాళ్లు కెనడాలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆతర్వాత 1990లో ఆస్ట్రేలియాకు వెళ్లి ఆస్ట్రో ఎలక్ట్రానిక్స్‌, నానో టెక్నాలజీ రంగంలో పరిశోధన సంస్థను స్థాపించారు. ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా 2016లో ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారానికి జగదీశ్‌ను అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసింది.  


 

 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని