అమెరికాలో తెలుగు విద్యార్థికి ప్రిన్సెస్ ‌డయానా అవార్డు

అమెరికాలో తెలుగు విద్యార్థి శ్రీనిహాల్ తమ్మన పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషికి ఫలితంగా అతడికి ‘ప్రిన్సెస్ డయానా’ అవార్డు లభించింది.

Published : 03 Jul 2023 11:28 IST

అమెరికాలో ఓ తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం లభించింది. సమాజంలో మార్పు కోసం వినూత్నంగా ఆలోచించే యువతను అమెరికాలో ‘ప్రిన్సెస్ డయానా’ అవార్డుతో సత్కరిస్తారు. అమెరికాలో తెలుగు విద్యార్థి శ్రీనిహాల్ తమ్మన పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషికి ఫలితంగా ఈ అవార్డు వరించింది. సమాజం కోసం ఆలోచించి మానవత్వంతో స్పందించిన నిహాల్ తమ్మన.. బ్యాటరీలు పర్యావరణానికి ఎంత కీడు చేస్తున్నాయనేది తెలుసుకుని చలించిపోయాడు. దీనికి రీ సైక్లింగ్‌ ఒక్కటే మార్గమని భావించి బ్యాటరీ రీసైక్లింగ్‌ను చిన్న వయసులోనే ఓ ఉద్యమంలా చేపట్టాడు. తన తోటి విద్యార్థుల సాయంతో ముందుగా ఇళ్లలో వినియోగించిన బ్యాటరీలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయడం ప్రారంభించాడు. ఇప్పటివరకు దాదాపు 2,75,000లకు పైగా బ్యాటరీలను నిహాల్ రీసైక్లింంగ్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటరీ రీసైక్లింగ్‌పై పాఠశాలల్లో అవగాహన సదస్సలు నిర్వహించాడు. ఈ సదస్సుల ద్వారా దాదాపు 1.25కోట్ల మందిలో చైతన్యం కల్పించాడు.

చిన్న వయసులోనే ఇలా పర్యావరణం గురించి ఆలోచించి దాని కోసం అకుఠింత కార్యదీక్షతో పనిచేస్తున్న శ్రీనిహాల్ తమ్మనను ఇప్పటికే అనేక అవార్డులు వరించాయి. ఇప్పుడు తాజాగా ప్రిన్సెస్ డయానా అవార్డు నిహాల్‌ కృషికి మరింత గుర్తింపు తెచ్చింది. 13 ఏళ్ల తెలుగు విద్యార్థి ఇలాంటి అవార్డు సాధించడం చరిత్రలోనే మొదటిసారని.. ఇది కచ్చితంగా తెలుగువారంతా గర్వించదగ్గ విషయమని పలువురు ప్రశంసిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని