Biden: ఏడాదికాల చీకట్లను చీల్చుకుని...

అమెరికా పునరుత్తేజంతో కోలుకుంటోందని, కరోనా మహమ్మారి నుంచి విముక్తికి చేరువైందని...

Updated : 06 Jul 2021 12:58 IST

మహమ్మారి నుంచి విముక్తికి చేరువయ్యాం

కానీ... పోరాటం ఇంకా పూర్తికాలేదు 
స్వాతంత్య్ర దినోత్సవంలో బైడెన్‌ ఉద్ఘాటన

వాషింగ్టన్‌: అమెరికా పునరుత్తేజంతో కోలుకుంటోందని, కరోనా మహమ్మారి నుంచి విముక్తికి చేరువైందని... అయితే మహమ్మారిపై పోరాటం ఇంకా ముగిసిపోలేదని అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం దేశభక్తిని చాటుకునే అత్యుత్తమ విధానమన్నారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్వేతసౌధం వద్ద ఆదివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. టీకా కార్యక్రమానికి ప్రాధాన్యమివ్వడం ద్వారా కొవిడ్‌పై విజయం దిశగా పయనించామన్నారు. మహమ్మారి తీవ్రతను- దేశ అత్యయిక స్థితి స్థాయి నుంచి స్థానిక సమస్యకు తగ్గించడంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అధ్యక్షుడు వివరించారు. ‘‘మహమ్మారి ఎంతో మంది ఆప్తులను దూరం చేసింది. లెక్కలేనన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు కుదేలయ్యాయి. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఏడాదికాల చీకట్లను చీల్చుకుని... గుండె కోత నుంచి, ఏకాంతం నుంచి, బాధ నుంచి బయటకు వస్తున్నాం.

అందుకే ఈ వేడుకలు ప్రత్యేకమైనవి. ప్రతి ఒక్కరూ వీటిలో పాల్గొనాలి. భయానక మహమ్మారి నుంచి స్వాతంత్య్రానికి చేరువయ్యామని మునుపటి కంటే విశ్వాసంతో, ధీశక్తితో ప్రకటిస్తున్నాం. కానీ... ఒకటి గుర్తుంచుకోండి. మహమ్మారిపై పోరాటం పూర్తికాలేదు. దీన్నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది’’ అని బైడెన్‌ పేర్కొన్నారు. మహమ్మారి నుంచి అమెరికా విముక్తి పొందిందన్న సందేశాన్ని చాటేలా దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. భారీ స్థాయిలో మిరుమిట్లుగొలిపే బాణ సంచా వినియోగించారు.

లక్ష్యానికి చేరువలో....

అగ్రరాజ్య స్వాతంత్య్ర దినమైన జులై 4 నాటికి దేశ వయోజనుల్లో 70% మందికి వ్యాక్సిన్‌ అందించాలని బైడెన్‌ లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటివరకూ 67% మందికి టీకా అందించారు. అయితే- ప్రమాదకర వేరియంట్లు వ్యాపిస్తున్న ప్రాంతాల్లో టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతుండటం, లక్షల మంది ప్రజలు వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తుండటం, ఇప్పటికీ నిత్యం 200 మంది కొవిడ్‌తో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు