Visa: విద్యార్థి వీసాలు వేగవంతం చేయండి.. బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరిన సెనేటర్ల బృందం

అంతర్జాతీయ విద్యార్థులకు వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీలకు అతీతంగా 24 మంది సెనేటర్ల బృందం..

Updated : 08 Aug 2021 10:55 IST

కొవిడ్‌ నుంచి కోలుకుంటున్నా ఆలస్యమెందుకు?
అమెరికా ప్రభుత్వానికి సెనేటర్ల బృందం లేఖ

వాషింగ్టన్‌: అంతర్జాతీయ విద్యార్థులకు వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీలకు అతీతంగా 24 మంది సెనేటర్ల బృందం.. బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరింది. కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న సమయంలోనూ వీసాల ప్రక్రియ మందకొడిగా సాగటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాసింది. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు రావటం దేశ ఉన్నత విద్యావ్యవస్థ, ఆర్థిక వ్యవస్థకు కీలకమని పేర్కొంది. ‘‘ఓ వైపు పోటీ దేశాలు అంతర్జాతీయ విద్యార్థులు, స్కాలర్లకు స్వాగతం పలుకుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా సైతం స్థిరమైన కాన్సులర్‌ సేవలు అందించాలి. వీసా అర్హతకు ఉన్న మినహాయింపుల్ని పొడిగించాలి. వర్చువల్‌ ఇంటర్వ్యూలు వంటి ప్రత్యామ్నాయాలు పెంచాలి. వీసాలు జారీ చేసే సిబ్బంది ఎక్కువ గంటలు పనిచేసేలా చూడాలి. విదేశీ ఏజెన్సీలతో సమన్వయం పెంచుకోవాలి’’ అని సెనేటర్లు కోరారు. ఈ పరిణామం.. అమెరికాలో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకుని వీసా కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం కేవలం అత్యవసర వీసాలు జారీ చేస్తోంది. ఫలితంగా విద్యాసంవత్సరం ప్రారంభంలో తమకు అవకాశం వస్తుందా, లేదా అన్న మీమాంసలో విద్యార్థులున్నారు. తాజాగా సెనేటర్ల ఒత్తిడితో వీసాల జారీ వేగవంతం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయ విద్యావంతుల అసోసియేషన్‌ డేటా ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో 10 లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. వీరంతా అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థకు 41 బిలియన్‌ డాలర్లను సమకూర్చారు. అందులో గణనీయమైన మొత్తాన్ని లక్ష మందికిపైగా భారతీయ విద్యార్థులే సమకూర్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని