సింగపూర్‌లో ఘనంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు

‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర్య దిన వజ్రోత్సవ సందర్భంగా ‘జయ ప్రియ భారత జనయిత్రీ’ కార్యక్రమం

Published : 20 Aug 2021 14:45 IST

‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర్య దిన వజ్రోత్సవ సందర్భంగా ‘జయ ప్రియ భారత జనయిత్రీ’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రఖ్యాత సినీ గేయ రచయిత, 18 సంవత్సరాలు భారత వాయుదళంలో సేవలందించిన భువనచంద్ర, ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొని అందరికీ చక్కటి ప్రోత్సాహం అందించారు ప్రతి పాటను తనదైన శైలిలో వ్యాఖ్యానించి ఆశీస్సులు అందించారు. సింగపూర్‌లో నివసించే 32 మంది గాయనీ గాయకులు, కవులు, పిల్లలు అందరూ కలిసి మాతృభూమిని కీర్తిస్తూ చక్కటి దేశభక్తి గీతాలు కవితలను వినిపించి భారతమాతకు సంగీత సాహిత్య నీరాజనాలు అర్పించారు.

ఈ సందర్భంగా భువనచంద్ర మాట్లాడుతూ ‘‘దూర దేశాల్లో ఉన్న ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ వంటి సంస్థలు పిల్లలు పెద్దలతో కలిసి కూర్చుని ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దేశ నాయకులను అమరవీరులను తలుచుకునే అవకాశం లభించించింది. అందరూ వారిని మరిచిపోతున్న సమయంలో భావితరాలకు కూడా తెలియజేసే విధంగా మహనీయుల ఘనతను పాటలు, కవితల రూపంలో అందించడం చాలా ఆనందంగా ఉంది’’ అని తెలియజేశారు.

కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ‘మాతృభూమికి దూరంగా ఉన్న వేళ, 75వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, అందరూ కలిసి  దేశమాతని స్తుతిస్తూ ఆనందంగా కలసి గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ మాధ్యమం ద్వారా సింగపూర్‌లో ఉండే పిల్లలకు, ఔత్సాహిక కవులకు, గాయనీ గాయకులకు మంచి ప్రోత్సాహం అందించే అవకాశం మా సంస్థకు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సుబ్బు వి పాలకుర్తి, పంపన సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. సంస్థ కార్యనిర్వాహక వర్గ సభ్యులు రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని  విజయవంతం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు