అమెరికాలోని తెలుగువారికి ఇక్కట్లు

ఇడా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అమెరికా అతలాకుతలం అవుతోంది. మృతుల సంఖ్య 46కు చేరింది. న్యూయార్క్‌, న్యూజెర్సీ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని తెలుగు కుటుంబాలూ తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఒకరిద్దరు గల్లంతైనట్లు నిర్ధారణ కాని వార్తలు

Updated : 04 Sep 2021 07:39 IST

భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలం
46కు చేరిన మృతుల సంఖ్య

ఈనాడు, అమరావతి: ఇడా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అమెరికా అతలాకుతలం అవుతోంది. మృతుల సంఖ్య 46కు చేరింది. న్యూయార్క్‌, న్యూజెర్సీ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని తెలుగు కుటుంబాలూ తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఒకరిద్దరు గల్లంతైనట్లు నిర్ధారణ కాని వార్తలు వస్తున్నాయని అక్కడి ప్రవాసాంధ్రులు తెలిపారు. ముఖ్యంగా న్యూజెర్సీలోని మిడిల్‌సెక్స్‌, గ్లోసస్టర్‌, సోమర్‌సెట్‌ వంటి కౌంటీల్లోని వివిధ నగరాల్లో స్థిరపడిన కొందరి తెలుగువారి ఇళ్ల బేస్‌మెంట్లలోకి నీళ్లు వచ్చేశాయని, టోర్నడో ప్రభావంతో పైకప్పులు దెబ్బతిని వాన నీరు ఇళ్లల్లోకి వచ్చిందని ప్రిన్స్‌స్టన్‌లో స్థిరపడిన వాసిరెడ్డి రామకృష్ణ ‘ఈనాడు’కి ఫోన్‌లో తెలిపారు. ‘‘బుధవారం రాత్రి అయిదు గంటల వ్యవధిలోనే 8-9 అంగుళాల వర్షం కురిసింది. చాలామంది తెలుగువారి ఇళ్లల్లోకి నీరు వచ్చింది. ముఖ్యంగా బేస్‌మెంట్‌లు మునిగిపోయాయి. ఇక్కడ ప్రతి ఇంటి బేస్‌మెంట్‌లో ఒక సంప్‌ ఉంటుంది. దానికి ఒక సబ్‌మెర్సిబుల్‌ మోటారు ఉంటుంది. భారీ వర్షాలకు బయటి నుంచి వచ్చిన నీళ్ల కంటే... భూమిలోంచి సంప్‌లోకి ఉబికి వచ్చిన నీళ్లతోనే బేస్‌మెంట్‌లు మునిగిపోయాయి. ఆ నీటిని తోడేందుకు... మోటార్లను ఏకధాటిగా పని చేయించడంతో అవి చెడిపోయాయి’’ అని రామకృష్ణ వివరించారు. ‘‘పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. చాలా రహదారుల్ని రాకపోకలకు  తెరిచారు. నదులు, కాలువలకు సమీపంలో ఉన్న 20-30% రోడ్లు మాత్రం ఇంకా మూసేసి ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. ‘‘బేస్‌మెంట్‌లో ఒకట్రెండు గదులు, లివింగ్‌ రూం, హోం థియేటర్‌ వంటివి ఏర్పాటు చేసుకుంటారు. భారీగా చేరిన నీటితో అవి దెబ్బతిన్నాయి’’ అని ఈస్ట్‌బ్రూన్స్‌విక్‌లో నివసించే, తానా న్యూజెర్సీ ప్రతినిధి వంశీ తెలిపారు. ‘‘మాకు సెప్టెంబరు మూడో తేదీ నుంచి అధికారికంగా ఎండాకాలం ముగిసి, వర్షాకాలం మొదలైనట్టు. సీజన్‌ ఆరంభంలోనే భారీ వర్షాలు కురవడం, టోర్నడోలు రావడం అరుదు. భారీ వర్షాలకు న్యూయార్క్‌లోనూ రోడ్లన్నీ మూసి వేశారు. సబ్‌వేల్లో ఇప్పటికీ నీరుంది’’ అని న్యూయార్క్‌లోని బుచ్చి రాంప్రసాద్‌ తెలిపారు. ‘‘సాధారణంగా ఇక్కడ ఎంత భారీ వర్షం కురిసినా... రోడ్లపై నీరు 3-4 గంటల్లో వెళ్లిపోతుంది. జాతీయ రహదారులపైకి దాదాపుగా నీరు చేరదు. అంతర్గత రహదారులపైనా ప్రతి 100-150 మీటర్లకు ఒకటి చొప్పున... వరద నీటిని డ్రెయిన్‌లోకి పంపించే ఏర్పాటు ఉంటుంది. ఇప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా వర్షపాతం నమోదవడంతో రోడ్లన్నీ నీట మునిగాయి. న్యూయార్క్‌లోనూ 8-9 గంటల పాటు ఏకధాటిగా వర్షం పడింది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘బేస్‌మెంట్‌లోని గదుల్లో... నేల నుంచి చలి ఎక్కువ రాకుండా కచ్చితంగా కార్పెట్‌లు వేస్తారు. వర్షపు నీటికి అవి దెబ్బతిన్నాయి. మళ్లీ కొత్త కార్పెట్‌ వేసుకోవడానికి 25-30 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది’’ అని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని