Veena Reddy: భారత్‌ - అమెరికా మధ్య తెలుగు వారధి 

ఆరోగ్యం, తాగునీరు, విద్యుత్తు, ఇంధనం, అడవుల పరిరక్షణలో భారత్‌కు అమెరికా విస్తృత స్థాయిలో చేయూతను

Published : 23 Sep 2021 09:55 IST

యూఎస్‌ఏఐడీ డైరెక్టర్‌గా వీణారెడ్డి

ఐదేళ్లలో రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 
‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడి


ఈనాడు - హైదరాబాద్‌: ఆరోగ్యం, తాగునీరు, విద్యుత్తు, ఇంధనం, అడవుల పరిరక్షణలో భారత్‌కు అమెరికా విస్తృత స్థాయిలో చేయూతను అందిస్తోంది. ముఖ్యంగా విద్యుత్తు, ఇంధన రంగంలో భారత ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సహకారాన్ని అందిస్తోంది. 2030 నాటికి విద్యుత్తులో 40 శాతం శిలాజరహితానికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. ఈ విషయాల్లో భారత్‌కు అమెరికా ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తోంది. అమెరికా-భారత్‌ మధ్య సంబంధాలు బలోపేతం కావటంలో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ - యూఎస్‌ఏఐడీ) కీలక భూమిక పోషిస్తోంది. తెలుగు వనిత వీణారెడ్డి  దానికి నేతృత్వం వహిస్తున్నారు. యూఎస్‌ఏఐడి భారత్, భూటాన్‌ మిషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన ఆమె కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినవారు. ఇటీవలే ఆ బాధ్యతలు చేపట్టారు. తొలిసారిగా హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా కట్టడి విషయంలో రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. 

భారత్‌లో ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయి? 

విద్యుత్తు, ఇంధన రంగాల్లో ఇప్పటికే రెండు దేశాలూ పలు ప్రాజెక్టులను చేపట్టాయి. ప్రైవేటు రంగం కూడా ఆసక్తి చూపుతోంది. ఈ రంగాల్లో భారతదేశం విశేషమైన లక్ష్యాలను చేపట్టి పర్యావరణానికి పెద్దపీట వేస్తోంది. గత ఐదేళ్లలో ప్రైవేటు, ప్రభుత్వ రంగాల నుంచి 200 కోట్ల  డాలర్ల పెట్టుబడులను తీసుకువచ్చాం. మరిన్ని పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. 

కాలుష్యం కట్టడి కోసం విద్యుత్తు వాహనాల వాడకం భారత్‌లో ఇప్పుడిప్పుడే మొదలైంది. అమెరికా ఎలాంటి సహకారాన్ని అందిస్తోంది? 

ఛార్జింగ్‌ కేంద్రాల వంటి సదుపాయాలను కల్పిస్తున్నాం. గత ఏడాది కాలంలో భారత్‌లోని పలు ప్రాంతాల్లో 60 ఛార్జింగ్‌ స్టేషన్లను యూఎస్‌ఏఐడీ ద్వారా ఏర్పాటు చేశాం. ఈ ఏడాది చివరి నాటికి 13 నగరాల్లో 2,000 వరకు కేంద్రాలు ఏర్పాటు చేసే పని చురుగ్గా సాగుతోంది. వాటిలో హైదరాబాద్‌ కూడా ఉంది. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌    రాష్ట్రాల్లో ఏవైనా కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసే ఆలోచన ఉందా?

ఏయే రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం ఉందో పరిశీలిస్తున్నాం. ఇప్పటికే టీబీ కట్టడికి సహకారాన్ని అందిస్తున్నాం. ట్రాన్స్‌జెండర్ల కోసం హైదరాబాద్‌ మాదాపూర్‌లో ప్రత్యేక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నేను భారతదేశం అంతటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తెలుగమ్మాయిని కావడంతో సహజంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిలో మరింత భాగస్వామ్యాన్ని కల్పించేందుకు ఉన్న మార్గాలను అధ్యయనం చేస్తాను. అడవుల పరిరక్షణ, తాగునీటి ప్రాజెక్టులను విస్తరించేందుకు ఇక్కడ అవకాశం ఉంది. 

కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు చేయూత కోసం ఏమైనా ప్రణాళికలు  రూపొందించారా?

ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. కరోనా రెండోదశ ఉపాధి రంగాన్ని దయనీయంగా మార్చింది. భారతదేశంలో 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. 

కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికా ఎలాంటి చేయూతను ఇస్తోంది? 

కొవిడ్‌ తొలిదశలో అమెరికాకు భారత ప్రభుత్వం చేయూత అందించింది. భారత్‌లో రెండోదశ తీవ్రస్థాయిలో ఉండటంతో అమెరికా 22.6 కోట్ల డాలర్ల సహాయాన్ని అందచేసింది. బీబీనగర్, మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆసుపత్రులకు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు పెద్ద సంఖ్యలో అందచేశాం. 

ఆరోగ్య రంగంలో ఆధునిక విజ్ఞానాన్ని పంచే    పథకంలో తెలుగు రాష్ట్రాల వైద్య కళాశాలలున్నాయా?

ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకు ఆధునిక విజ్ఞానాన్ని పంచేందుకు పలు దేశాల్లో ‘హబ్‌ అండ్‌ స్పోక్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. తెలంగాణలోని గాంధీ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన హబ్‌ ద్వారా శిక్షణ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఏపీలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు, శ్రీవేంకటేశ్వర మెడికల్‌ కళాశాలలను కూడా గుర్తించాం. వీటి ద్వారా రెండు దేశాల వైద్య నిపుణులు కరోనాను ఎదుర్కోవటంలో అనుసరించాల్సిన విధానాలను ఇతర వైద్యులకు చేరవేస్తారు. 

కరోనా వైరస్‌ సరళిని గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ఏ దశలో ఉంది?

హైదరాబాద్‌లోని సీసీఎంబీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ శాటిలైట్‌ కేంద్రం విజయవాడలో ఏర్పాటైంది. కాలక్రమంలో వైరస్‌ ఎలా రూపాంతరం చెందుతోంది. బాధితులను ఆ మార్పులు ఎలా ప్రభావితం చేస్తున్నాయో విశ్లేషించేందుకు ఇది ఉపకరిస్తుంది. చికిత్సలో అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించేందుకు వీలుపడుతుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని