Sunday Times: బ్రిటన్‌లో భారత సంతతి సిరుల పంట

భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషీ సునాక్‌, భారత పౌరసత్వమున్న ఆయన భార్య అక్షతా మూర్తి ‘సండే టైమ్స్‌’ పత్రిక శుక్రవారం ప్రచురించిన వార్షిక బ్రిటిష్‌ కుబేరుల జాబితాలో మొట్టమొదటిసారిగా చోటు సంపాదించారు.

Updated : 21 May 2022 09:47 IST

‘సండే టైమ్స్‌’ కుబేరుల జాబితాలో మనవాళ్లు
తొలిసారిగా సునాక్‌ దంపతులకు చోటు

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషీ సునాక్‌, భారత పౌరసత్వమున్న ఆయన భార్య అక్షతా మూర్తి ‘సండే టైమ్స్‌’ పత్రిక శుక్రవారం ప్రచురించిన వార్షిక బ్రిటిష్‌ కుబేరుల జాబితాలో మొట్టమొదటిసారిగా చోటు సంపాదించారు. 34 ఏళ్ల నుంచి ప్రచురితమవుతున్న ఈ జాబితాలో ఒక అగ్రశ్రేణి రాజకీయ నాయకుడి పేరు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం.

సునాక్‌ దంపతులు 73 కోట్ల పౌండ్ల ఆస్తిపాస్తులతో జాబితాలో 222వ స్థానంలో నిలిచారు. 2847 కోట్ల పౌండ్ల సంపదతో హిందుజా సోదరులు అగ్ర స్థానంలో నిలిచారు. వీరు కూడా భారత సంతతికి చెందినవారే. వీరి సంపదలో అత్యధిక భాగం భారతీయ స్టాక్‌ లిస్టయిన కంపెనీల నుంచే లభించింది. ముంబయిలోని ఇందస్‌ ఇండ్‌ బ్యాంకు, చెన్నైలోని అశోక్‌ లేలాండ్‌, ఐటీ సంస్థ హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌ వంటి కంపెనీలతోపాటు ఇతర కంపెనీల షేర్లలో పెట్టిన పెట్టుబడులు హిందుజా సోదరులను సండే టైమ్స్‌ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కూర్చోబెట్టాయి. బ్రిటన్‌కు చెందిన సర్‌ జేమ్స్‌ డైసన్‌ కుటుంబం 2300 కోట్ల పౌండ్లతో రెండో స్థానంలో నిలవగా, మూడో స్థానాన్ని తిరిగి భారత సంతతికి చెందిన రూబెన్‌ సోదరులు కైవసం చేసుకున్నారు. వారి ఆస్తిపాస్తులు 2226 కోట్ల పౌండ్లు. 1700 కోట్ల పౌండ్లతో ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్‌ ఆరో స్థానంలో నిలిచారు. సండే టైమ్స్‌ ప్రచురించిన 177 మంది శతకోటీశ్వరుల జాబితాలో ఇంకా పలువురు భారత సంతతివారు ఉన్నారు. 16వ స్థానంలో లోహాల వ్యాపారి అనిల్‌ అగర్వాల్‌, 39వ స్థానంలో చిల్లర వర్తక దిగ్గజాలు మొహసిన్‌, జుబేర్‌ ఇస్సా ఉన్నారు. టాప్‌ 100లో చోటు సంపాదించిన భారత సంతతివారిలో లార్డ్‌ స్వరాజ్‌ పాల్‌, బయోకాన్‌ వ్యవస్థాపకులు కిరణ్‌ మజుందార్‌ షా, ఆమె భర్త జాన్‌ షా (75వ ర్యాంకు) ప్రభృతులు ఉన్నారు. ఈ ఏడాది సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో కొత్తగా ఆరుగురు వచ్చి చేరారు. జాబితాలోని వారి మొత్తం సంపద 65,300 కోట్ల పౌండ్లు. ఇది గత ఏడాదికన్నా 5,500 కోట్ల పౌండ్లు ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని