Visa: భారతీయ విద్యార్థులకు వీసాలిస్తాం: చైనా

కరోనా సమయంలో భారత్‌కు వెళ్లి, ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా అక్కడే నిలిచిపోయిన విద్యార్థులకు శుభవార్త. వీరితోపాటు వివిధ రకాలవారు తిరిగి చైనాకు రావడానికి వీలుగా త్వరలో వీసాలు జారీ చేయనున్నామని చైనా సోమవారం ప్రకటించింది. ‘

Updated : 23 Aug 2022 07:39 IST

ఇరుక్కుపోయిన వారికి ఊరట

బీజింగ్‌: కరోనా సమయంలో భారత్‌కు వెళ్లి, ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా అక్కడే నిలిచిపోయిన విద్యార్థులకు శుభవార్త. వీరితోపాటు వివిధ రకాలవారు తిరిగి చైనాకు రావడానికి వీలుగా త్వరలో వీసాలు జారీ చేయనున్నామని చైనా సోమవారం ప్రకటించింది. ‘భారతీయ విద్యార్థులూ మీకు అభినందనలు. మీ నిరీక్షణ ఫలించింది. చైనాకు తిరిగి స్వాగతం. మీతో కలిసి ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల విభాగం కౌన్సెలర్‌ జీ రోంగ్‌ ట్వీట్‌ చేశారు. విద్యార్థులకు, వ్యాపారులకు, చైనాలో పనిచేస్తున్నవారి కుటుంబ సభ్యులకు సంబంధిత వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైందని దిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం కూడా ప్రకటించింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్తగా వెళ్లేవారికి, నిలిచిపోయిన చదువును పూర్తి చేయాలనుకుంటున్నవారికి ఎక్స్‌-1 వీసాలను జారీ చేస్తామని తెలిపింది. చైనా నుంచి భారత్‌కు వెళ్లిన దాదాపు 23,000 మంది భారతీయ విద్యార్థులు కొవిడ్‌ ఆంక్షల వల్ల అక్కడే చిక్కుకుపోయారని అంచనా. వీరిలో ఎక్కువమంది వైద్య విద్యార్థులే. చదువు పూర్తి చేయడానికి వెంటనే తిరిగి చైనాకు రాదలచుకున్నవారి జాబితాను చైనా ఇటీవలే అడిగి తీసుకుంది. శ్రీలంక, పాకిస్థాన్‌, రష్యా సహా వివిధ దేశాల నుంచి విద్యార్థులు ఇటీవలి కాలంలో ప్రత్యేక విమానాల్లో చైనాకు చేరుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా చైనాకు వెళ్లేవారు విశ్వవిద్యాలయాలు తమకు జారీ చేసిన ప్రవేశ పత్రాన్ని వీసా నిమిత్తం సమర్పించాలి. పాత విద్యార్థులైతే విశ్వవిద్యాలయ ప్రాంగణానికి తిరిగి వచ్చేందుకు చైనా జారీ చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి. ప్రస్తుతానికి చైనాకు నేరుగా విమానాలు లేకపోవడం మాత్రం సమస్యగా నిలవనుంది. విమానాలు నడపడంపై రెండు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని