US Visa: అమెరికా వీసా ఫీజులు పెరిగాయ్‌...!

అమెరికా వీసా ఫీజులు పెరిగాయి. ఈ ఏడాది మే 30వ తేదీ నుంచి కొత్త రుసుములు అమలులోకి రానున్నాయి. 2014 తర్వాత ఇప్పుడే ఫీజులు పెంచినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

Updated : 12 Apr 2023 07:43 IST

మే 30 నుంచి అమలు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసా ఫీజులు పెరిగాయి. ఈ ఏడాది మే 30వ తేదీ నుంచి కొత్త రుసుములు అమలులోకి రానున్నాయి. 2014 తర్వాత ఇప్పుడే ఫీజులు పెంచినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎనిమిది రకాల వీసాల ఫీజులను పెంచింది. వీటిలో పర్యాటక వీసా బి1/బి2  ఫీజు పెంచటం చర్చనీయాంశంగా ఉంది. పెంపుదల జాబితాలో విద్యార్థి (ఎఫ్‌-1) వీసా లేకపోవటం తల్లిదండ్రులకు ఒకింత ఊరట కల్గించే అంశం. ఈ ఏడాదిలో అన్ని రకాల వీసాలకు సంబంధించి పది లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాటిలో ఇప్పటికి నాలుగు లక్షలు పూర్తి చేసినట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. లక్ష్యాన్ని చేరుకుంటామన్న ఆశాభావంతో ఉన్నట్లు పేర్కొంది.

త్వరలో విద్యార్థి వీసా స్లాట్లు

త్వరలో విద్యార్థి(ఎఫ్‌-1)వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రతి ఏటా రెండు సీజన్లలో అమెరికాలోని విద్యా సంస్థలు ప్రవేశాలు నిర్వహిస్తుంటాయి. స్ప్రింగ్‌ సీజనుకు సంబంధించి త్వరలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. మే నెల నుంచి ఆగస్టు వరకు విద్యార్థి వీసా దరఖాస్తులను దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతాలలోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాలు అనుమతిస్తాయి. గడిచిన ఏడాది పెద్ద సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ అయ్యాయి. ఈ దఫా కూడా పెద్ద సంఖ్యలోనే వీసాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గడిచిన స్ప్రింగ్‌ సీజను కన్నా 25 నుంచి 30 శాతం ఎక్కువగా వీసాలు జారీ అవుతాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫాల్‌ సీజనుతో పోలిస్తే స్ప్రింగ్‌ సీజనులోనే విద్యార్థులు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని