USA: భారత కాన్సుల్ జనరల్‌గా నియామకమైన డాక్టర్‌ శ్రీకర్ రెడ్డికి ఘన స్వాగతం

శాన్ ఫ్రాన్సిస్కో నూతన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పులకు ‘అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్’ (ఏఐఏ) ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.

Updated : 25 Aug 2023 23:30 IST

అమెరికా: శాన్ ఫ్రాన్సిస్కో నూతన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పులకు ‘అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్’ (ఏఐఏ) ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. బే ఏరియాకు చెందిన విజయ ఆసూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 36 స్థానిక భారతీయ ఆర్గనైజేషన్ సభ్యులు విచ్చేసి శ్రీకర్‌ రెడ్డిని అభినందించారు. మిల్‌ పిటాస్‌, శాన్‌ హోసె, ఫ్రీమాంట్‌ నగరాలకు చెందిన మేయర్లు, ప్రజా ప్రతినిధులు, భారతీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య డాక్టర్‌ శ్రీకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రతిమను ఘనంగా సన్మానించారు. తన పట్ల ఇంతటి అభిమానం చూపిస్తున్న ఇండియా, తెలుగు ప్రజలకు డాక్టర్ శ్రీకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా, భారత్‌ మధ్య మరింత మెరుగైన ద్వైపాక్షిక సంబంధాల కోసం పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రముఖులు జయరామ్‌ కోమటి, రాజ్‌ బానోత్‌, జీవన్‌ జుక్షితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ అకున్ సభర్వాల్, కాన్సుల్ అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ రమేష్‌ కొండ ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పుల నేపథ్యం..

ఇండియాలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పుల (ఐఎఫ్‌ఎస్‌) నూతన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కోగా ఎంపికయ్యారు. వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. 2001లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో ఆయన చేరారు. దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పలు హోదాల్లో పని చేశారు. జూలై 2011 నుండి ఆగస్టు 2014 వరకు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాస్‌పోర్ట్ సేవల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పాస్ పోర్టుల డెలివరీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెచ్చారు. 2013లో ‘పాస్‌పోర్ట్ సేవా పురస్కార్’కు ఎంపికయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని