భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్ సంధు డాలస్ పర్యటన విజయవంతం

సర్దార్ వల్లభ్‌బాయి పటేల్ జయంతిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సింధు అన్నారు. 

Updated : 03 Nov 2021 01:32 IST

డాలస్: సర్దార్ వల్లభ్‌బాయి పటేల్ జయంతిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సింధు అన్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్‌ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ), ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్‌టీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ జనరల్‌ అసీం మహాజన్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. సుమారు 50 భారతీయ సంఘాల నుంచి 200కు పైగా నాయకులు సమావేశానికి హాజయ్యారు. ఐఏఎన్‌టీ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర భారత దేశ రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధును, ఐఏఎన్‌టీ అధ్యక్షుడు శైలేష్ షా కాన్సులేట్‌ జనరల్‌ అసీం మహాజన్‌ను సమావేశానికి పరిచయం చేశారు. 

ఈ సందర్భంగా భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు మాట్లాడుతూ.. డాలస్ అమెరికాలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. టెక్సాస్ రాష్ట్రంలో అనేక మంది ప్రవాస భారతీయులు వివిధ రంగాలలో రాణిస్తున్నారని కొనియాడారు. అమెరికా-ఇండియా మధ్య సత్సంబంధాలు, వాణిజ్య అభివృద్ధికి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ఇతోధికంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌బాయి పటేల్ జయంతిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారత కాన్సులేట్‌ జనరల్‌ అసీం మహాజన్‌ మాట్లాడుతూ.. డాలస్ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రవాస భారతీయులకు అవసరమైన సేవలందించేందుకు ఎల్లప్పుడూ తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 

సమావేశం అనంతరం మహాత్మా గాంధీ మెమోరియల్‌ ప్లాజాను తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు, అసీం మహాజన్‌ సందర్శించారు. గాంధీజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఇంత పెద్ద విగ్రహం నిర్మాణం చేసిన మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్‌ ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులను, ఇర్వింగ్ పట్టణ అధికారులను వారు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు తరణ్‌జిత్‌ సింగ్‌ సంధును సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. శైలేష్ షా తదితరులు అసీం మహాజన్‌ను సన్మానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని