అమెరికా బే ఏరియాలో ఘ‌నంగా భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు

భార‌త స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు పలుదేశాల్లో ఉన్న భార‌తీయులు ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్క‌రించ‌డంతోపాటు స్వాతంత్య్ర సంగ్రామ ఘ‌ట్టాల‌ను మ‌న‌నం చేసుకుని,

Published : 16 Aug 2022 00:31 IST

ప్ర‌త్యేక అతిథిగా హాజరైన క‌మ‌ల్ హాసన్ 

అమెరికా: భార‌త స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు పలుదేశాల్లో ఉన్న భార‌తీయులు ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్క‌రించ‌డంతోపాటు స్వాతంత్య్ర సంగ్రామ ఘ‌ట్టాల‌ను మ‌న‌నం చేసుకుని, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు నివాళుల‌ర్పించారు. అగ్ర‌రాజ్యం అమెరికాలోని బే ఏరియాలోనూ భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను ‘స్వ‌దేశ్‌’ పేరుతో ప్రవాసీలు నిర్వ‌హించారు. ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌’లో భాగంగా అసోసియేష‌న్ ఆఫ్ ఇండో అమెరిక‌న్స్‌(ఏఐఏ), బారీ 92.3 ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి బే ఏరియాలోని 39 భారతీయ సంస్థ‌లు తమ స‌హ‌కారం అందించాయి.  ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు క‌మ‌ల్‌హాసన్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌రయ్యారు. ఈ వేదికపై ఆయన న‌టించిన చిత్రం ‘విక్ర‌మ్’ విజ‌యోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కమల్‌ హాసన్ మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాల తర్వాత భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవాలను సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం మరపురానిదని కొనియాడారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాసాంధ్రులు తమ జన్మభూమి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఓ) డాక్ట‌ర్ టీవీ నాగేంద్ర‌ ప్రసాద్ సహా ప‌లువురు ప్రముఖులు  జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. 

ఈ వేడుకలకు మేయర్ రిచ్ ట్రాన్ (మిల్పిటాస్), మేయర్ సామ్ లిక్కార్డో (శాన్ జోస్), స్టేట్ సెనేటర్ బాబ్ వికోవ్స్కీ, శాంటా క్లారా కౌంటీ సూపర్‌వైజర్ సిండి చావెజ్, కౌంటీ సూపర్‌వైజర్ ఒట్టో లీ, శాంటా క్లారా డిస్ట్రిక్ట్ అటార్నీ జెఫ్ రోసెన్, రో ఖన్నా కార్యాలయం నుంచి కాంగ్రెస్ ప్రతినిధి,సెనేటర్ డేవ్ కోర్టేస్, అసెంబ్లీ సభ్యుడు యాష్ కల్రా, అసెంబ్లీ సభ్యుడు అలెక్స్ లీ తో పాటు  ఇతర నగరాలకు చెందిన మేయర్లు హాజరయ్యారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ బొంటా, ఓక్లాండ్ మేయర్ లిబ్బి షాఫ్, కాంగ్రెస్ మహిళలు అన్నా ఎషూ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జెండా వంద‌నం అనంతరం సభను ఉద్దేశించి ప్రముఖులు ప్రసంగించారు. భారతీయులకు ఉన్న దేశ భక్తిని చూసి సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. దీనిని ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా మార్చిన అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ బృందానికి డాక్ట‌ర్ టీవీ నాగేంద్ర‌ ప్రసాద్ అభినంద‌న‌లు తెలిపారు.

భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించడం, మన వారసత్వం, సంస్కృతిని పరిరక్షించడంలో ఏఐఏ ముందుంద‌ని పలువురు కొనియాడారు. ‘స్వ‌దేశ్‌’ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ఉద్దేశం భార‌త సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప్ర‌చారం చేయ‌డ‌మేన‌ని ప‌లువురు పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను మిలే సుర్ మేరా ప‌ర్య‌వేక్షించారు.  వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన 200 మందికిపైగా చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా క్యారమ్స్, చెస్ పోటీలను నిర్వహించారు. 100 అడుగుల భారతీయ జెండా పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంత‌రం ప్ర‌ముఖ సింగ‌ర్ విద్యా వోక్స్ నిర్వ‌హించిన సంగీత విభావ‌రి వీనుల విందు చేసింది. సంజయ్ గుప్త(సీపీఏ), రియల్ ఎస్టేట్ ఏజెంట్ నాగరాజ్, ఐసీసీ బ్యాంకు, ఆజాద్ ఫైనాన్సియల్స్, సంపూర్ణ ఆయుర్వేద, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్‌గా వ్యవహరించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని