అదే కాళోజీకి మనం ఇచ్చే నివాళి: కేవీ రమణాచారి

తెలంగాణ భాష, సంస్కృతి పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు

Published : 13 Sep 2021 20:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ భాష, సంస్కృతి పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీకి ఇచ్చే సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. వంశీ డాక్టర్ సినారె విజ్ఞాన పీఠం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉగాండా సంయుక్త ఆధ్వర్యంలో తాజాగా దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన 107వ జయంతి తెలంగాణ భాషా దినోత్సవంలో రమణాచారి మాట్లాడారు. కాళోజీ పట్ల గౌరవ భావంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తూ స్ఫూర్తిని పంచుతోందని తెలిపారు. వంశీ రామరాజు తొలుత స్వాగతం పలుకుతూ కాళోజీ వ్యక్తిగతంగా తన వివాహం దగ్గరుండి జరిపించారని, కవిగా వంశీ ఆర్ట్ థియేటర్స్ నిర్వహించిన సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. కాళోజీ సినారె స్ఫూర్తితో యాభై ఏళ్లుగా సాంస్కృతిక సేవతోపాటు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు.

తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్  జుర్రు చెన్నయ్య ఈ కార్యక్రమానికి అనుసంధానం చేశారు. ఉగాండ తెలుగు సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ రావు, ప్రస్తుత అధ్యక్షుడు వెల్దుర్తి పార్థసారధి తమదేశంలో కాళోజీ స్ఫూర్తితో తెలుగు భాషకు తెలుగువారికి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాలు స్వీకరించిన ప్రముఖ కవులు ఆర్ సీతారాం, డా.అంపశయ్య నవీన్, రామా చంద్రమౌళి ప్రసంగిస్తూ కాళోజి చెప్పిందే ఆచరించారని, గొప్ప ప్రజాస్వామ్యవాది అని అన్నారు సామాన్యులకు సైతం చేరేలా కవిత్వం రాస్తూనే అందులో అరుదైన కవితా శిల్పాన్నిపొదిగారని  అన్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వి.ఆర్. విద్యార్థి, కాళోజి కుమారుడు రవికుమార్, ఉగాండకు చెందిన రచయిత వ్యాస కృష్ణ బూరుగుపల్లి తదితరులు ప్రసంగిస్తూ కాళోజీ కవిత్వంలో, వ్యక్తిత్వంలో అనేక విశిష్టతలను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు