టెక్సాస్‌ వర్సిటీలో తెలుగు బోధనా తరగతుల పునఃప్రారంభం హర్షణీయం: చిట్టెన్‌ రాజు

ప్రపంచాన్ని వణించిన కరోనాతో పాటు ఇతర కారణాల రీత్యా ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో తెలుగు శాఖ గత కొన్నేళ్లుగా సిస్తేజంగా ఉన్నప్పటికీ మళ్లీ కాస్త ఆర్థిక పరిపుష్టిని సాధించిందని  వంగూరి ఫౌండేషన్‌ అధ్యక్షులు చిట్టెన్‌రాజు అన్నారు.

Published : 16 Apr 2023 22:32 IST

 

అమెరికా: ప్రపంచాన్ని వణించిన కరోనాతో పాటు ఇతర కారణాల రీత్యా ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో తెలుగు శాఖ గత కొన్నేళ్లుగా సిస్తేజంగా ఉన్నప్పటికీ మళ్లీ కాస్త ఆర్థిక పరిపుష్టి సాధించిందని వంగూరి ఫౌండేషన్‌ అధ్యక్షులు చిట్టెన్‌రాజు అన్నారు. ఆన్‌లైన్‌లో తెలుగు భాషా బోధన తరగతులను పునఃప్రారంభించడం ఎంతో హర్షనీయమన్నారు. ఈ తరగతుల పునఃప్రారంభానికి, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించే ఉద్దేశంతో 2015లో అందరి సహాయ సహకారాలు,ఆశీస్సులతో తాము నెలకొల్పిన వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ఎండోమెంట్‌ ఫండ్‌ ఫర్‌ తెలుగు స్టడీస్‌ దోహదం చేసిందని యూనివర్సిటీ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ డాన్‌ డేవిస్‌ అన్నారని తెలిపారు. ఆస్టిన్‌లోని ఆయన కార్యాలయంలో ఏప్రిల్‌ 14న కలిసినప్పుడు తనకు వ్యక్తిగతంగా, అధికారికంగా కృతజ్ఞతలు చెప్పారన్నారు. ఆ సందర్భంలో ఓ నాలుగు వాక్యాలు తనతో తెలుగులో మాట్లాడటం ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించిందన్నారు. గతంలో తాను అక్కడికి ఒకట్రెండు సార్లు వెళ్లినప్పుడు ఆత్మీయులు, ప్రముఖ సాహితీవేత్తలు అప్షర్‌, కల్పన రెంటాలతో గడిపిన క్షణాలు గుర్తుకువచ్చాయన్నారు. 

వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ఏర్పాటు చేసిన నిధుల ఆధారంగా కొత్తగా చేరే విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు మొదలైన వాటికి ఆర్థిక సహాయం అందుతుందని డాన్‌ డేవిస్‌ ప్రకటించారన్నారు. గతేడాది ఆ నిధులతో ఒక అమ్మాయి గ్రాంథిక భాషపై ప్రస్తుతం శ్రీకాళహస్తిలో పరిశోధన చేస్తోందని ఆయన చెప్పినప్పుడు తనకెంతో సంతోషంగా అనిపించిందని వంగూరి చిట్టెన్‌ రాజు తెలిపారు. అలాగే, మరువాడ ముఖలింగ శాస్త్రి, లక్ష్మీదేవిల పేరిట ఏర్పడిన ఎండోమెంట్ ఫండ్‌ నిధులు తెలుగు భాషా ప్రాచుర్యానికి దోహదపడుతున్నాయని వెల్లడించారని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయంతో అఫ్సర్‌ అనుబంధం కొనసాగుతూనే ఉందని డాన్‌ డావిస్‌ చెప్పినప్పుడు ఎంతో సంతోషం కలిగిందన్నారు. అమెరికాలో విశ్వవిద్యాలయ స్థాయిలో తగిన ప్రాధాన్యత కలిగించి తద్వారా  తెలుగు భాషా, సాహిత్యాలకు మనుగడ, అభివృద్ధికి దోహదం చేయడం, అంతర్జాతీయ భాషగా భాషాకోవిదులతో గుర్తింపురావాలనే మనమంతా ఆశిస్తున్నామని ఈ సందర్భంగా చిట్టెన్‌ రాజు అభిలషించారు.

వచ్చే వేసవి కాలంలో తెలుగు తరగతులకు దరఖాస్తులు కోరుతున్నట్టు డా. డాన్‌ డేవిస్‌ చెప్పారని, ఆ విషయం మన తెలుగువారందరికీ, ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగువారికి చెప్పాలని తనను కోరారన్నారు.  మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో నిర్వహించే ఈ సమ్మర్‌ క్రెడిట్‌ కోర్సుకు నూతన విద్యార్థులు మే 1లోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. సౌత్‌ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలుగు సమ్మర్‌ ప్రోగ్రామ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు https://liberalarts.utexas.edu/southasia/language-program/ క్లిక్‌ చేయాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని