Karthikeya 2: నిఖిల్‌కు న్యూజెర్సీ ఎడిసన్‌ మేయర్‌ అభినందన

నిఖిల్‌ అద్భుత నటుడని న్యూజెర్సీ ఎడిసన్‌ మేయర్‌ సామ్‌ జోషి అన్నారు. నిఖిల్‌కు ప్రశంసా పత్రాన్ని అందించారు.

Published : 01 Nov 2022 15:29 IST

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్‌ మేయర్‌ సామ్‌ జోషి (Sam Joshi).. టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ (Nikhil Siddhartha)ను అభినందించారు. తమ కార్యాలయం తరఫున నిఖిల్‌కు ప్రశంసా పత్రాన్ని అందించారు. దీన్ని గౌరవంగా భావిస్తున్నానంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు నిఖిల్‌. ఈయన హీరోగా తెరకెక్కిన ‘కార్తికేయ 2’ ఇటీవల విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌ ప్రేక్షకులూ ఈ చిత్రాన్ని ఆదరించారు. యునైటెడ్‌ స్టేట్స్‌లో ఈ సినిమా ఘన విజయం సాధించటంతో నిఖిల్‌ను మేయర్‌ తన కార్యాలయానికి ఆహ్వానించి, అభినందించారు. నిఖిల్‌ ప్రతిభకు గుర్తింపుగా పత్రాన్ని ఇచ్చినట్టు జోషి పేర్కొన్నారు.

శ్రీకృష్ణ కంకణ రహస్యం, ద్వారకా నగర ప్రాముఖ్యత నేపథ్యంలో రూపుదిద్దుకుంది ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్‌ డాక్టర్‌గా కనిపించి అలరించారు. సుమారు రూ. 120 కోట్లు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీ ‘జీ 5’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే సగటు ప్రేక్షకులతోపాటు అమితాబ్‌ బచ్చన్‌, పవన్‌ కల్యాణ్‌లాంటి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని